తెలంగాణలో కొన్నాళ్లుగా రైతులను యూరియా కొరత వేధిస్తోంది. ఈ సమస్య కారణంగా కేసీఆర్ సర్కారుకు కాస్త చెడ్డపేరు కూడా వచ్చింది. యూరియా కోసం రైతులు రోజుల తరబడి ఎదురు చూసే పరిస్థితి తలెత్తింది. దీని కోసం లాఠీ చార్జీలు కూడా చేయాల్సి వచ్చింది. అందుకే తెలంగాణకు ఎక్కువ యూరియా మంజూరు చేయాలంటూ కేంద్రానికి తెలంగాణ సర్కారు విన్నవించుకుంటోంది.


ఈ మేరకు ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడను కలిశారు. రబీకి కావాల్సిన ఎరువుల కేటాయింపుపై వినతి పత్రం ఇచ్చారు. ఈ ఏడాది మాన్ సూన్ ఆలస్యంగా ప్రారంభమైనా.. ఎక్కువ భూమి సాగులోకి వచ్చిందని గుర్తు చేశారు. కోటి 11 లక్షల ఎకరాలలో తెలంగాణలో పంటలు ఉన్నాయి. వరి కూడా ఎక్కువ సాగులోకి వచ్చిందని కేంద్ర మంత్రికి వివరించారు.


రబీ కోసం 7 లక్షల 70వేల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని కేంద్ర ప్రభుత్వానికి ఇండెంట్ ఇచ్చామని కేంద్ర మంత్రిని కలిసిన తరవాత నిరంజన్ రెడ్డి చెప్పారు. కేంద్రం 7 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించింది. మిగిలిన 70 వేల మెట్రిక టన్నులు కూడా ఇవ్వాలని అడిగితే కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని నిరంజన్ రెడ్డి చెప్పారు.


అక్టోబర్ లో లక్షా 50 వేల మెట్రికి టన్నుల రాష్ట్రానికి పంపించాల్సి ఉంటుంది. దాంతో పాటే మిగితాది కూడా పంపిస్తే రాష్ట్రంలో స్టోరేజ్ చేసుకుంటామని కేంద్రమంత్రికి వివరించారట.రబీలో 8 లక్షల ఎకరాలలో అదనంగా సాగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారట. దాన్ని దృష్టిలో ఉంచుకుని యూరియా కేటాయింపులు జరపాలని కోరామని మంత్రి తెలిపారు.


ఎంత అదనపు భూమి సాగులోకి వస్తుందన్న అంశంపై కేంద్ర వ్యవసాయ శాఖతో సమన్వయం చేసుకుంటామని కేంద్రమంత్రి చెప్పారు.. ఈ ఏడాది ఖరీప్ లో ఏకంగా 2 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగం పెరిగింది. అయినా కేంద్రంతో సమన్వయం చేసుకొని యూరియా కొరత లేకుండా చేశాం.. కేవలం 7 కేంద్రాల్లోనే యూరియా పంపిణీలో ఆలస్యంతో ఇబ్బందులు ఏర్పడ్డాయని మంత్రి చెప్పుకొచ్చారు.


షిప్ ల ద్వారా దిగుమతి చేసుకునే 46 శాతం యూరియాలో సమయానికి 39 శాతం మాత్రమే చేరింది. మిగతావి షిప్ లలో చేరే సరికి కొంత ఆలస్యమైంది. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కారణం కాదు.. అంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వివరణ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: