ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికతో పాటు టిఎస్-ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశం కూడా సెగలు రాజేస్తుంది. ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం హుజూర్ నగర్ ఉపఎన్నిక మీద కూడా ఉంటుందని తేలిపోయింది. ఈ సమ్మె ఎఫెక్ట్ హుజుర్ నగర్ లో సీపీఐ-టీఆర్ఎస్ ల మధ్య చీలిక తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ జేఏసీ తాజాగా సోమాజిగూడ ప్రెస్-క్లబ్ లో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి సిపిఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును దుయ్యబట్టారు. ఆర్టీసీ కార్మికుల తొలగింపు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తాము టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చే అంశంపై పునః సమీక్ష చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. సిపిఐకి ఎప్పుడు ప్రజా పోరాటాలు, ప్రజా సమస్యలే కీలకమని ఆయన పేర్కొన్నారు. హుజూర్ నగర్ లో టిఆర్ఎస్ కు మద్దతు తెలిపినప్పుడు ఆర్టీసీ సమ్మె నోటీసు మాత్రమే ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఆ తరవాత ఆర్టీసీ సమ్మె విషయంలో టీఅరెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సబబుగా లేదని చాడ వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికులకే కాదు అన్ని వర్గాలకు అండగా ఉంటామని, ఉద్యోగాలు తీసేస్తాం! లాగేస్తాం! పీకేస్తాం! అంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ నేటి మాటల వింటే నాటి వాగ్ధానాలు ౙ్నప్తికి వచ్చి నవ్వు వస్తోందని, ఈ సందర్భంగా గతంలో ఆయన చేసిన వాగ్దానాలు మరోసారి గుర్తుచేసుకోవాలని విమర్శించారు. సోదర తెలుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రి యువకుడు జగన్మోహన రెడ్డి చేస్తోన్న పనులను, ప్రజా సంక్షేమం పట్ల ఆయన చూపిస్తున్న శ్రద్ధను గమనించైనా కేసీఆర్ నేర్చుకోవాల్సింది చాంతాడంత ఉందని చాడ వెంకటరెడ్డి సూచించారు.

ఏదేమైనా నిన్నటికి నిన్న కేసీఆర్, సీపీఐ మద్దతు కోసం టీఆర్ఎస్ నాయకులను ఆ పార్టీ నేతల వద్దకు పంపారు. సీపీఐ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ కు అలా మద్దతు ప్రకటించిందో చేసిందో? లేదో?  ఇప్పుడు వెంటనే యూటర్న్ తీసుకుని పునః సమీక్ష చేస్తామని చెప్పడంతో హుజూర్ నగర్ రాజకీయం రసవత్తరంగా మారింది. ఏదేమైనా ఇటు ఉపఎన్నిక, అటు టిఎస్-ఆర్టీసీ సమ్మెతో తెలంగాణలో రాజకీయం రోజురోజుకు సెగలు చిమ్ముతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: