తెలంగాణాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజు కూడా కొనసాగుతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనీ ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. కార్మికులు చేస్తున్న డిమాండ్ కు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోగా... ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించేలా సమ్మె చేస్తున్నారని చెప్పి కార్మికులను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. 48,500మంది ఉద్యోగులను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, ఇది అంత తేలికైన విషయం కాదని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.
కెసిఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని వివిధ రాజకీయ పార్టీలు అంటున్నాయి. కార్మిక సంఘాలకు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటె, ఈరోజు నుంచి షెడ్యూల్ ప్రకారం బస్సులను నడపబోతున్నట్టు రవాణాశాఖ మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. తాత్కాలిక ఉద్యోగులతో బస్సులను నడపబోతున్నట్టు పువ్వాడ ప్రకటించారు. ప్రైవేట్ బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికుల నుంచి ఇప్పటికే కంప్లైట్లు వస్తున్నాయి.
దీనిపై కూడా మంత్రి పువ్వాడ స్పందించారు. అధిక చార్జీలు వసూలు చెయ్యొద్దని అయన ప్రైవేట్ బస్సుల యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. ఇక ఆర్టీసీ బస్సుల్లో మాదిరిగానే విద్యార్థులు, వికలాంగులు, పాత్రికేయుల పాస్ లను అనుమతించాలని ప్రభుత్వం ప్రైవేట్ బస్ యాజమాన్యాన్ని కోరింది. ఇకపై ప్రతి బస్సులో ఛార్జీలకు సంబంధించిన టారిఫ్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్టు పువ్వాడ తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు అయన తెలిపారు.
ఇక ఇదిలా ఉంటె, ఈరోజు హైకోర్టులో ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన పిటిషన్ ను విచారించబోతున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెపై వివరణ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. తమ డిమాండ్లు సరైనవే అని, తమను ప్రభుత్వంలో విలీనం చేయాలనీ కోరితే ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగించినట్టు చెప్తోందని కోర్టుకు విన్నవించబోతున్నారు. ఆరు రోజులుగా చేస్తున్న సమ్మె కారణంగా ఆర్టీసీ కి వచ్చిన నష్టం గురించి ప్రభుత్వం కోర్టులో పేర్కొనే అవకాశం ఉంది.