సుస్థిర సువిశాల లౌకిక ప్రజాస్వామిక రాజ్యం, ప్రపంచలోనే అధిక జనాభా గల దేశం భారత్. పౌరాణిక కాలం అంటే జనపదాల దశలోనే ప్రజలకు ప్రజాస్వామ్య రుచి చూపిన దేశం. నాటి "వైశాలి" ప్రపంచం లోనే తొలి ప్రజాస్వామ్య దేశం. అలాంటి శక్తివంతమైన భారత్ అంతర్గత విషయాల్లో సైనిక నియంతల పాలనలో నిరంతరం ప్రజలను బానిసలుగా మార్చిన - ఒక మత రాజ్యం - "ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్థాన్" - కమ్యూనిస్ట్ పాలనలో తరతరాలుగా మ్రగ్గుతూ ప్రజాస్వామ్య వాసనలే తెలియని పేరుకే "పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా" తలదూర్చటానికి ప్రయత్నించటం సిగ్గుచేటు.
తాజాగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ల మధ్య చైనాలో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో కశ్మీర్ అంశం పైనే ప్రధాన, అతి కీలక చర్చలు జరిగినట్టు వస్తున్న వార్తలపై భారత్ తీవ్ర స్థాయిలో స్పందించింది. కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని భారత విదేశాంగ శాఖ తేల్చిచెప్పింది. తమ అంతర్గత వ్యవహాల్లో జోక్యం చేసుకో వద్దంటూ ఒక సార్వభౌమ దేశంగా భారత్ పొరుగు దేశాలకు గట్టి హెచ్చరికే చేసింది.
భారత దేశ సార్వభౌమ హక్కుల కిందికి వచ్చే ఏ అంశంపైనైనా చైనా, పాకిస్తాన్ చర్చించడం భావ్యం కాదని దీనిపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్
కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత అంతర్గత వ్యవహారాలపై ఇకనైనా మాట్లాడడం మానుకోవాలంటూ చైనాకు ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గలిగిన భారత్-చైనా ఇరువురి విశాల ప్రయోజనాలకు ఇది శుభం కాదంటూ హితవు పలికారు.
"చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, పాకిస్తాన్ ప్రధాని
ఇమ్రాన్ ఖాన్ మధ్య జరిగిన సమావేశంలో కశ్మీర్ అంశం ప్రస్తావనకు వచ్చిందన్న వార్తను మేము చూశాం. జమ్మూ కశ్మీర్ భారత్ లో అంతర్భాగమన్న దానిపై భారత్ కు స్థిరమైన, స్పష్టమైన వైఖరి ఉంది. ఈ విషయంలో మా వైఖరి చైనా కు కూడా బాగా తెలుసు. భారత అంతర్గత వ్యవహారాలపై ఇతర దేశాలు మాట్లాడాల్సిన అవసరం లేదు" అని మన విదేశాంగశాఖ ప్రతినిధి రవీశ్
కుమార్ పేర్కొన్నారు.
ఆర్టికల్ 370 నిర్వీర్యం లాంటి చారిత్రక నిర్ణయాన్ని తీసుకోవటానికి తమకెంత ధైర్యం ఉందో! అన్నవిషయం చెప్పేసిన నరేంద్ర మోడీ ప్రభుత్వం, తదనంతర విపత్కర పరిణామాల్ని ఎదుర్కోవటానికి ఎంతలా సిద్ధం అయిందో! ఎలాంటి ప్రణాళికలు రచించిందో చెప్పకనే అర్దమౌతుంది. గతంలో మాదిరిగా కశ్మీర్ అంశంపై ఏ ఒక్కరూ మాట్లాడాల్సిన అవసరం లేదన్న విషయాన్ని తరచూ స్పష్టం చేసింది. భారత్ లో రెండు రోజులు పర్యటనకు వస్తున్న చైనా అధినేత జిన్ పింగ్ కు ఎలాంటి మొహమాటాల కు తావివ్వని రీతిలో విదేశాంగశాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.
చైనా లాంటి పెద్ద దేశాధినేత షి జింపింగ్ భారత్ పర్యటించటానికి వస్తున్నారంటే, ముందుగా సుహృద్భావ వాతావరణాన్ని సృష్టిస్తారు. కాని భారత్ ఇంత ఘాటుగా హెచ్చరిక ఇవ్వటానికి సాధారణంగా వెనుకాడుతుంది. అందుకు భిన్నంగా భారత్ మాత్రం తన కృతనిశ్చయాన్ని సుధృఢంగా స్పష్టం చేసింది. కశ్మీర్ విషయంలో బారత్ ఎంత పారదర్శకంగా ఉందో తెలియజేయటానికి, మరి చైనా మరో మాట మాట్లాడే అవకాశం లేదని అర్థమయ్యేలా తాజా ప్రకటన వెలువరించిందనే చెప్పాలి.