ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కంటివెలుగు పధకాన్ని సమర్ధవంతంగా  అమలు చేసేందుకు ప్రభుత్వం  టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కలెక్టర్ల నేతృత్వంలో పనిచేస్తుంది. ఇందులో భాగంగా 160 మంది జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్లు, 1415 మంది వైద్యాధికారులను నియమించారు. ఇప్పటికే అన్ని పీహెచ్సీలకు కంటి పరీక్షలకు సంబంధించిన కిట్లను పంపారు. 42 వేల మంది ఆశావర్కర్లు, 62 వేల మంది టీచర్లు, 14 వేల మంది ఏఎన్‌ఎంలు, 14 వేల మంది ప్రజారోగ్య సిబ్బంది కంటి వెలుగు పథకం అమలులో తమ వంతు బాధ్యతను నిర్వర్తించనున్నారు.



ప్రపంచ అంధత్వం దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం జగన్ అనంతపురంలోని ఓ జూనియర్ కాలేజీలో ఈ కార్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు, శస్త్రచికిత్సలు చేయనున్నారు. కంటివెలుగు పథకం ద్వారా అంధత్వ సమస్యలను 80శాతం తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. మొత్తం 5 దశల్లో మూడేళ్లపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ పథకంలో భాగంగా తొలి విడతలో సుమారు 70 లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 16 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్‌లో కంటి పరీక్షలు నిర్వహిస్తారు.




కంటి సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులను నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు విజన్ సెంటర్లకు పంపిస్తారు. ఆ తరువాత 3, 4, 5, 6 దశల్లో కమ్యూనిటీబేస్ ఆధారంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి వీరికి పరీక్షలు, చికిత్సలు మొదలుపెట్టే ఆలోచనలో జగన్ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్ మోహన్ రెడ్డి తొలిసారిగా అనంతపురం జిల్లాకు వస్తుండటంతో ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం ఘనంగా ఏర్పాట్లు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: