రివర్స్ టెండరింగ్  విధానం పై పలు మార్పులు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రూ. 10 లక్షల నుంచి రూ. 100 కోట్ల లోపు పనులకు రివర్స్ టెండరింగ్‌ను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించాలని  అధికారులను ఆదేశించారు.  ప్రస్తుతం ఉన్న ఈ-ప్రొక్యూర్‌మెంట్  మీదే సాధ్యమైనంత మేరకు  పారదర్శకత ఉండేలా పలు జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం  నిర్వహించారు. రూ. 100 కోట్లు పైబడిన కాంట్రాక్ట్ పనులను ముందస్తు న్యాయ సమీక్ష  నివేదించటంతో పాటు రివర్స్ టెండరింగ్‌ను ఇప్పటికే అమలు చేస్తున్నారు.

ఇకపై రూ. 10 లక్షల పైబడిన పనులకు కూడా రివర్స్ టెండరింగ్‌కు పంపాలని  నిర్ణయించారు. వివిధ సర్వీస్‌లు, పనులు,కొనుగోళ్ల కోసం ఆహ్వానించే టెండర్లలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ  రివర్స్ టెండరింగ్‌ను మరింత పటిష్టం చేయాలనీ  అధికారులకు సూచించారు. ప్రభుత్వ కాంట్రాక్ట్‌లు, సర్వీస్‌లు, కొనుగోళ్లలో ప్రజాధనం ఆదా కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
 రూ. 100 కోట్ల పైబడిన పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా విప్లవాత్మక మార్పులు, సంస్కరణలు తీసుకు వచ్చామన్నారు. 

రివర్స్ టెండరింగ్‌లో మరింత పోటీకి దారి తీస్తుందని , రూ. 10 లక్షల నుంచి 100 కోట్ల లోపు పనులు, సర్వీస్‌లు, కొనుగోళ్లకు కూడా ఇలాంటి సంస్కరణలు అవసరమన్నారు. అన్నిటిలో  పారదర్శకత ఉండేందుకు ఈ విధానాన్ని పాటించాలని  సూచించారు. టెండర్లలో ఎక్కువ మంది పాల్గొనేలా నూతన విధానానికి రూపకల్పన జరగాలని చెప్పారు,అందరికీ అందుబాటులో  రివర్స్ టెండరింగ్ ఉంచాలన్నారు. తక్కువ ధరకు కోట్‌చేసిన టెండర్ వివరాలను ఈ- ప్రొక్యూర్‌మెంట్ సైట్‌లో నిక్షిప్తం చేయాలని, వారం రోజుల పాటు ఈ వివరాలు అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని  అధికారులను ఆదేశించారు. ఆ తరువాత రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని సూచించారు.



 రాష్ట్ర స్థాయిలోనే కాక జిల్లాల వారీగా టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు. ఈ- ప్రొక్యూర్‌మెంట్ కోసం ఉన్న పోర్టల్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించుట లేదని  సీఎం దృష్టికి తెచ్చారు. ప్రభుత్వపరంగా చేస్తున్న కొనుగోళ్లు, అప్పగిస్తున్న సర్వీస్‌లు, పనుల విషయంలో ఒక నిర్దిష్టమైన జాబితాను రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఆ తరువాత టెండర్ల విషయంలో ఒకే విధానాన్ని పాటించే విధంగా చూడాలన్నారు. కొత్త విధానాన్ని జనవరి ఒకటి నుంచి అమల్లోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు . ఈ పద్ధతిలో బిడ్ లభించిన వారికి  చెల్లింపులు త్వరగా  జరిగేలా  చూడాలని సంబంధిత శాఖతో అనుసంధానం చేయాలన్నారు. ప్రభుత్వ సర్వీస్‌లు,ఈ- ప్రొక్యూర్‌మెంట్,రివర్స్ టెండరింగ్  పనులు  సులువుగా సాగేందుకు ఒక ఐఏఎస్ అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: