భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు ప్రతిబింబాలుగా వెలుగొందేవి భారతీయ పండుగలు. ఆనంద ఉత్సాహాల కేళితో భరత జాతి, కుల, మత, వర్గ, లింగ, ప్రాంత, విభేదాలను విస్మరించి అత్యంత సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీపాల కాంతుల శోభావళి దీపావళి. భూమిపై మానవ జాతిని అతి కౄరంగా హింసిస్తూ హనన ప్రక్రియ కొనసాగించే నరకాసురుడనే దానవుణ్ణి మహాశక్తి రూపం లో ఆ దైవం సంహరించన రోజు నరక చతుర్దశి ఐతే - ఆ మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపాలు వెలిగించి ఆ వెలుగుల కాంతుల్లో తమ ఆనందాన్ని పండుగ లా జరుపుకున్న రోజే దీపావళి. ఈ ఆనందాన్ని ఆ దానవుణ్ని సమ్హరించి ప్రజలను పరవసింపజేసిన దేవతలు సత్యా కృష్ణులు ఇది త్రేతా యుగం నాటి కథ.
లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. గాడాంధకారాన్ని తన వెలుగు వీచికలతో తొలగిస్తూ నలు చెరగులా వెలుగులు చిమ్మే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను భారత జాతి జనులు జరుపుకుంటారు ఇది ద్వాపర యుగం నాటి మాట.
దీప మాళలికల శోభతో శోబ్ హాయమానంగా వెలుగొందే గృహాప్రాంగణాలు, యువటుల సౌందర్యం వస్త్రాభరణాల శోభతో వెల్లి విరిసి యువకుల ఆనంద కేళీ విలాసాల కోలాహలంతో ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెప రెపలు, పిండివంటల ఘుమ ఘుమలు, బాణసంచా చిటపటలు, ఈ దివ్య దీపావళి కి ఎనలేని సోయగాలు అద్దుతాయి. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపావళి పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు.
"దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ - దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే "
"దీప శిఖ" ను పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తూ, మహిళామణులంతా ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాస మంతా సాయం సంధ్య వేళలో దీపాలను వరుసగా వెలిగిస్తారు. గృహం, గృహప్రాంగణం, దేవాలయాలు, ఆధ్యాత్మిక వేదికలంతా అలంకరించి పరిసరాలను దీపాల సమూహంతో దివ్య కాంతి పుజాలను వెదజల్లి అంధకారాన్ని పారద్రోలతారు.
చివరకు ఈ దీపాలను ముత్తయిదువులు, కార్తీక పౌర్ణమికి నాటికి సముద్ర స్నానాలను ఆచరించి జీవ నదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యాని కి ప్రతీకలుగా భావిస్తారు. పైగా ఈ దీపావళి శరదృతువులో అరుదెంచటం విశేషం. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు, ఆరోగ్యానందాలకు అనువైన కాలమిది. కోట్ల దీపాల దివ్య పండుగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఒక విశిష్టత కథ ప్రచారం లో ఉంది.
పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి, ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వెేస్తాడు అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూచిన దుర్వాసనుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును, సర్వ వైభవాన్ని, సిరి సంపదలను, శక్తిసామర్ధ్యాలను కోల్పోయి, దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తిచెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పునరుజ్జీవ జేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి.
ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా? అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ! త్రిలోకాథిపతీ,"నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షుల కు మోక్ష లక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయ లక్ష్మీగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యా లక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధన లక్ష్మీగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీ దేవిగా ప్రసన్నురాలౌతానని" సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మి అష్ట రూపాలను సేవించి పూజించేవారికి సర్వ సంపదలు చేకూరుతాయని విశ్వాసం.
ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది. నరకాసురుడనే రాక్షసుడు చెలరేగి సాధు జనాలను పీడిస్తూ దేవ, మర్త్య లోకాలలో సంక్షోభాన్ని కలిగి స్తుంటాడు. కృత యుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహ స్వామికి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. అతడు లోక కంటకుడైనా మహా విష్ణువు వధించరాదని, తల్లి యైన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి. మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది.
అప్పటికి నరకాసురుడు లోక కంటకుడై చేస్తున్న అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్య జరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరా ఘాతాలకు నరకాసురుడు అంత మౌతాడు. తన పుత్రుని పేరు చిరస్థాయిగా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశి పర్వదినంగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెర నుండి సాధు జనులు, పదహారు
వేల మంది రాజకన్యలు విడిపించబడ్డారు.
ధర్మం పునః ప్రతిస్టించ బడటం తో నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపు కుంటారు. ఈ సంబరాలు జరుపు కునే రోజు అమవాస్యకావడంతో, చీకటిని పారద్రోలుతూ ప్రజలు దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచాకాల్చి వేడుక చేసు కున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది.