రియో ఒలంపిక్లో సత్తా చాటి రజత పతకాన్ని కైవసం చేసుకున్న
తెలుగు తేజం, వెండికొండ పీవీ సింధు, జిమ్నాస్టిక్లో పతకం గెలువక పొయినా అందరి
మన్ననలు పొందిన దీపా కర్మాకర్తో, కిదాంబి శ్రీకాంత్ తో పాటు పలువురు భారత
ఒలంపియన్లు ఇప్పుడు వివాదాల్లో చిక్కుకున్నారు.
ఇటీవలే ముగిసిన రియో ఒలింపిక్స్ లో అన్ని విభాగాల్లో పదుల సంఖ్యలో బ్రెజిల్ వెళ్లినా ఉత్తి చేతులతో తిరిగి వచ్చినప్పటికి.. భారత సత్తా చాటుతూ తెలుగు తేజం పీవీ సింధు బ్యాడ్మింటన్ లో రజత పతకాన్ని సాధించింది. ఇక పతకం సాధించలేకపోయినా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ దేశ ప్రజల హృదయాలను గెలుచుకుంది. అయితే వీరిద్దరితో పాటు రెజ్లర్ యోగేశ్వర్ దత్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ కూడా ఓ వివాదంలో చిక్కుకున్నారు.
అయితే ఈ వివాదం పెద్దదేమీ కాకున్నా...క్రీడాకారులకు కాస్త తలనొప్పి కలిగించే వ్యవహారమనే చెప్పాలి. ఒలంపిక్ క్రీడలకు ముందు స్పాన్సర్లతో కుదిరిన ఒప్పందాలను ధిక్కరిస్తూ వారు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తేలానే ఉన్నాయి. రియో ఒలింపిక్స్ కు సంబంధించి భారత ఒలింపిక్ సంఘంతో ‘లీ నింగ్’ అనే సంస్థ ఒప్పందం చేసుకుంది. ఇందుకు సంబంధించి రూ.3 కోట్లను భారత ఒలింపిక్ సంఘానికి ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న సదరు సంస్థ... రియోలో భారత క్రీడాకారులంతా తమ బ్రాండ్ దుస్తులనే వాడాలని షరతు పెట్టింది.
పలు మ్యాచులు ఆడే సమయంలో పీవీ సింధు, దీపా కర్మాకర్, యోగేశ్వర్ దత్, కిదాంబి శ్రీకాంత్ లు పలు మ్యాచ్ ల్లో లీ నింగ్ బ్రాండ్ దుస్తులు కాకుండా ఇతర కంపెనీలవి వాడారట. దీనిపై లీ నింగ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ భారత ఒలింపిక్ సంఘానికి లేఖ కూడా రాసింది. దీంతో భారత ఒలంపిక్ సంఘం సదరు క్రీడాకారుల వివరణ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.