ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్, తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు అదరగొట్టిన సంగతి తెలిసిందే. దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ చేసిన రాయుడు.. చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2019 వరల్డ్ కప్‌లో చోటు దక్కకపోవడంతో మనస్థాపానికి గురైన రాయుడు క్రికెట్‌కు గుడ్ బై చెప్పడం.. ఆ తర్వాత తన మనసు మార్చుకోవడం తెలిసిందే. త్రీ డీ ప్లేయర్ అనే కారణంతో విజయ్ శంకర్‌ను జట్టులోకి తీసుకున్నట్లు నాటి చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పడం.. ధావన్, విజయ్ శంకర్ గాయపడినా కూడా.. తనకు పిలుపు అందకపోవడంతో.. రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడు.


రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రాయుడు ఎవరికీ అందుబాటులో లేకుండా పోయాడు. హైదరాబాద్ శివార్లలోని తన ఫామ్ హౌస్‌లో ఒక్కడే గడిపాడు. రాయుడు రిటైర్ అవుతున్నట్లు ప్రకటించిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ ఫోన్ చేసి అతనితో మాట్లాడినట్లు సమాచారం. ‘‘ఇంకా క్రికెట్ ఆడే సత్తా నీలో ఉంది. రిటైర్మెంట్ నిర్ణయంపై మరోసారి ఆలోచించుకో.. చెన్నై సూపర్ కింగ్స్‌తో అనుబంధం కొనసాగించు’’ అని సూచించాడట. సూపర్ కింగ్స్ సీఈవో నుంచి ఫోన్ కాల్ వచ్చిన నెల రోజుల్లోనే రాయుడు మనసు మార్చుకున్నాడు. లాక్‌డౌన్ సమయంలో తనను తాను మార్చుకున్న రాయుడు.. ముంబైతో జరిగిన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నైను విజయపథంలో నడిపాడు. రాయుడికి భావోద్వేగాలు ఎక్కువని చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపాడు. రాయుడు అద్భుతంగా ఆడతాడని.. ఆట గమనాన్ని మార్చేయగలడని.. ముంబైపై విజయంలో అతడి అనుభవం, నైపుణ్యం కీలక పాత్ర పోషించాయన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: