కొవిడ్ ఆంక్ష‌ల నడుమ చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేనివిధంగా పూర్తి భిన్నమైన వాతావరణంలో టోక్యో విశ్వ‌క్రీడ‌లు ప్రారంభమయ్యాయి. కరోనా మ‌హమ్మారి భ‌యంతో ప్రారంభ వేడుక‌ల‌కు ఫ్యాన్స్‌ను స్టేడియంలోకి అనుమతించక‌పోయినా మెగా ఈవెంట్‌పై మక్కువతో స్థానికులు పెద్ద సంఖ్యలో నేషనల్‌ స్టేడియం వద్దకు తరలివ‌చ్చారు. అతికొద్దిమంది క్రీడాకారులు, అతిథుల సమక్షంలో ప్రారంభోత్సవం కన్నులపండువగా సాగింది. వీఐపీలు, అతిథులు కలిసి 950 మంది, వివిధ కార్యక్రమాల్లో భాగస్వాములైనవారు 10 వేలమంది వేడుకకు హాజరయ్యారు.

అబ్బుర‌ప‌ర్చిన యానిమేష‌న్‌..
బ్లాక్‌బోర్డుపై చాక్‌పీస్ గీస్తున్న వీడియోతో ఆరంభ వేడుక‌లు మొద‌ల‌య్యాయి. ఆ తర్వాత చేతితో గీసిన ఆ ఆకారాల యానిమేషన్‌ చిత్రాలు స్టేడియం అంతా పరుచుకొని అబ్బురపరిచాయి. స్టేడియం మధ్యలో నిలుచున్న మహిళా అథ్లెట్‌ తన చేతిని నేలపై ఉంచడం ద్వారా విత్తనం నాటుతున్న దృశ్యాన్ని ఆవిష్కరించింది. ఆమె మెల్లెగా లేస్తుండగా..ఆ అథ్లెట్‌ నీడలో నాటిన విత్తనం చిగురు తొడుగుతున్న దృశ్యాన్ని చూపించి అబ్బురపరిచింది. కొవిడ్‌ నేపథ్యంలో అథ్లెట్ల మానసిక స్థితికి అద్దం పడుతూ ప్రదర్శించిన వీడియో అద్భుతమని చెప్పాలి. విశ్వక్రీడల కౌంట్‌డౌన చివరి క్షణంలో నేషనల్‌ స్టేడియాన్ని విహంగ వీక్షణంలో చూపడం వావ్‌ అనిపించింది.

బాణసంచా, మ్యూజిక్‌ మజా..
ఖాళీ స్టేడియంలోనే ప్రారంభ కార్యక్రమం నిర్వహించినా ఎప్పటిమాదిరే బాణాసంచా వెలుగులు జిగేల్ మనిపించాయి. బాణసంచా వెలుగులు, హోరెత్తించే మ్యూజిక్‌ నడుమ పోటీపడుతున్న జట్లు మార్చ్‌పాస్ట్‌ చేశాయి. ఆధునిక ఒలింపిక్స్‌ ఆతిథ్య దేశం గ్రీస్‌ మార్చ్‌పాస్ట్‌లో తొలి జట్టుగా రాగా ఆతిథ్య జపాన్‌ చివరన విచ్చేసింది.

మేరీకోమ్‌, మన్‌ప్రీత్ చేత‌ప‌ట్టి..
భార‌త లెజెండ్రీ బాక్సర్‌ మేరీకోమ్‌, హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్‌ సింగ్ త్రివ‌ర్ణ‌ పతకాన్ని చేతబట్టి సగర్వంగా టోక్యో ప్ర‌ధాన స్టేడియంలోకి అడుగు పెట్ట‌గా వారి వెనుక‌ మొత్తం 19 మంది అథ్లెట్లు, ఆరుగురు అధికారులు అనుసరించారు. క్రీడాకారుల  ఒలింపిక్స్‌ ప్రమాణానంతరం గేమ్స్‌ లాంఛనంగా ప్రారంభమైనట్టు చక్రవర్తి నరుహిటో ప్రకటించారు. జపాన్‌ ప్రఖ్యాత సింగర్‌ మిసియా సంగా జాతీయ గీతం ‘కిమ్‌ గ యో’ను అత్య‌ద్భుతంగా ఆలపించగా ఆఖ‌ర్లో జపాన్‌ టెన్నిస్‌ స్టార్‌ నవోమి ఒసాకా ఒలింపిక్‌ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభోత్స‌వం ముగిసింది.

సమాజంలో వెలుగు రేఖలు: బాచ్‌
కొవిడ్ మ‌హ‌మ్మారి క‌రాళ నృత్యం చేస్తున్న ప‌రిస్థితుల్లో ప్రపంచానికి ఒలింపిక్‌ అథ్లెట్లు ‘ఆశ’ అనే బలమైన సందేశాన్ని ఇచ్చార‌ని ఐఓసీ చీఫ్‌ బాచ్ అన్నారు. ఈ విశ్వక్రీడలు అంధ‌కారంలోని మాన‌వ‌ సమాజంలో వెలుగు రేఖలు ప్రసరింపజేశాయ‌ని చెప్పారు.

చొక్కాలేకుండా ప్ర‌వేశించిన అథ్లెట్లు
వనౌటు, టొంగా జట్ల పురుష జట్ల పతాకధారులు చొక్కాలేకుండా ప్రవేశించి కలకలం సృష్టించారు. వారు శరీరానికి నూనె పూసుకొని రావడం చర్చనీయాంశమైంది.

1824 డ్రోన్లు..
స్టేడియంపైన 1824 డ్రోన్లు టోక్యో-2020 చిహ్నం ఆకారంలో నిలవడం కార్యక్రమానికే హైలైట్‌గా నిలిచింది.


మరింత సమాచారం తెలుసుకోండి: