* శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్
ముంబైకర్ సూర్యకుమార్ యాదవ్ (34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 50) అర్ధశతకంతో, వైస్ కెప్టెన్ కమ్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (4/22) నాలుగు వికెట్లతో చెలరేగడంతో మూడు టీ20ల సిరీస్లో భారత్ బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా సమష్టి పోరాటంతో 38 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకపై విజయ దుందుభి మోగించింది. టాస్ కోల్పయి ప్రత్యర్థి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన గబ్బర్ గ్యాంగ్ 20 ఓవర్లలో 164/5 స్కోరు చేసింది. అరంగేట్రం ఓపెనర్ పృథ్వీషా.. చమీర బౌలింగ్లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరి నిరాశపర్చాగా సారథి శిఖర్ ధవన్ 46 పరుగులతో పర్వాలేదనిపించాడు. పృథ్వీ నిష్ర్కమణతో క్రీజులోకి వచ్చిన వన్డౌన్ బ్యాట్స్మన్ సంజూ శాంసన్ (27)తో కలిసి ధవన్ రెండో వికెట్కు 51 పరుగులు జోడించించారు. సంజూ అవుటయ్యాక హాఫ్ సెంచరీ పూర్తి చేసి దూకుడు మీదున్న సూర్యను హసరంగ పెవిలియన చేర్చడంతో టీమిండియా స్కోరుబోర్డు వేగం తగ్గింది. మిడిలార్డర్ బ్యాట్స్మెన్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (10), ఇషాన్ కిషన్ (20 నాటౌట్), క్రునాల్ పాండ్యా (3 నాటౌట్) భారీ షాట్లు ఆడలేకపోయారు. దుష్మంతా చమీర్ (2/24), వానిండు హసరంగ (2/28) తలో రెండు వికెట్లు తీశారు.
అనంతరం చేజింగ్లో లంక 18.3 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటై ఓటమి పాలైంది. ఓపెనర్ భనుక (10), ధనంజయ (9) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరి ఆతిథ్య జట్టుకు శుభారంభం ఇవ్వలేకపోయారు. భనుకను క్రునాల్ వెనక్కి పంపగా.. ధనంజయను చాహల్ క్లీన్ బౌల్డ్ చేసి దెబ్బకొట్టాడు. ధాటిగా ఆడుతున్న మరో ఓపెనర్ అవిష్క (26)ను భువనేశ్వర్ అవుట్ చేయడంతో లంకేయులు 50/3తో కష్టాల్లో పడ్డారు. ఈ దశలో అసలెంకా ఒక్కడే (44) రాణించాడు. ఇక, భారత బౌలర్లలో భువనేశ్వర్ నాలుగు, దీపక్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటారు. నాలుగు వికెట్లు తీసిన భువికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.