ఈ క్రమంలోనే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి రిషబ్ పంత్ కీ పలు సూచనలు సలహాలు ఇచ్చాడు. టి20 ఫార్మాట్లో ఆండ్రూ రస్సెల్ తరహాలోనే రిషబ్ పంత్ ఆడాలి అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఒక్కసారి జోరందుకున్న తర్వాత వెనక్కి తగ్గకూడదని సూచించాడు రవిశాస్త్రి. రిషబ్ పంత్ ఐపిఎల్ లో ఇప్పటి వరకు 11 మ్యాచ్ లు ఆడితే 281 పరుగులు చేశాడు. కొన్ని మ్యాచ్ లలో ఆరంభాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే రవిశాస్త్రి స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
రిషబ్ పంత్ ఒక్కసారి జోరందుకున్న తర్వాత మళ్లీ అతని బ్యాటింగ్ శైలి మార్చకూడదు. టి20 ఫార్మాట్ లో అతడు రస్సెల్ తరహాలో ఆడితేనే బాగుంటుంది. బౌలర్ ఎవరైనా సరే కొట్టే అవకాశం ఉంది అంటే చాలు కొట్టడమే బెటర్. ఆండ్రూ రస్సెల్ లాగా ఆడితే జనం అనుకున్న దానికంటే ఎక్కువ మ్యాచ్ లలో జట్టును గెలిపించగలడు అంటు అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆండ్రూ రస్సెల్ ఆలోచనలు ఎంతో స్పష్టంగా ఉంటాయి. ఒక్కసారి కుదురుకున్నాడంటే దంచికొట్టడం మొదలుపెడతాడు. ఎట్టి పరిస్థితుల్లో అతడు వెనకడుగు వేయడు. ఇక దేని గురించి ఆలోచించడు. రిషబ్ పంత్ లో కూడా అతనిలా ఆడే సామర్ధ్యం ఉంది. ఇన్నింగ్స్ బాగా ఆరంభించిన ఇక వాటిని పెద్ద ఇన్నింగ్స్ గా మార్చలేకపోతున్నాడు అంటూ రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు..