రాజ్‌వర్ధన్‌ హంగర్కర్‌ గురించి వినే వుంటారు. అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో కీలక ఆటగాడు ఇతడు. ICC మెగా ఈవెంట్‌లో కూడా ఈ యువ ఆటగాడు రాణించాడు. అందువల్లనే IPL-2022 మెగా వేలంలో చెన్నై సూపర్‌కింగ్స్‌ 1.5 కోట్లు చెల్లించి మరీ ఇతగాడిని కొనుగోలు చేసింది. అయితే, ఇంతవరకు అతడికి జట్టులో చోటు దక్కకపోవడం బాధాకరం. ఈ సీజన్‌లో ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకున్న ధోని సేన శుక్రవారం అంటే ఈరోజు చివరి లీగ్‌ ఆడుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ అయినటువంటి బ్యాటర్‌ పార్థివ్‌ పటేల్‌ రాజ్‌వర్ధన్‌కు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.  
 
కనీసం ఆఖరి పోరులోలైనా అతడిని భాగం చేస్తే బావుంటుందని సూచించాడు. ఈ మేరకు పార్థివ్‌ పటేల్‌ మాట్లాడుతూ.. "చివరి మ్యాచ్‌లో CSK గెలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా వాళ్లు కొత్త కాంబినేషన్లు ట్రై చేస్తే బావుంటుంది. అయితే, అదెలా ఉంటుందో మనం ఊహించలేము. నాకైతే ప్రశాంత్‌ సోలంకి స్థానంలో రాజ్‌వర్ధన్‌ హంగర్కర్‌ ఈ చివరి జట్టులోకి స్థానం కల్పిస్తే చూడాలని ఉంది. ధోని అతడికి అవకాశం ఇస్తాడని భావిస్తున్నాను. ఒకవేళ రాజ్‌వర్ధన్‌ ఫిట్‌గా ఉండి, అతడికి ఛాన్స్‌ వస్తే కచ్చితంగా తనను తాను నిరూపించుకోగలడు." అని క్రిక్‌బజ్‌తో తాజాగా వ్యాఖ్యానించాడు.  
 
కాగా, క్యాష్‌ రిచ్‌ లీగ్‌ తాజా ఎడిషన్‌లో CSK దారుణంగా ఫెయిల్ అయింది. తొలుత రవీంద్ర జడేజాకు పగ్గాలు అప్పజెప్పిన యాజమాన్యం, వరుస వైఫల్యాల నేపథ్యంలో MS ధోనిని మళ్లీ కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసినదే. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో కేవలం నాలుగంటే నాలుగు గెలిచి 8 పాయింట్లతో పట్టికలో 9వ స్థానానికి దిగజారిపోయింది. అయితే ఇపుడు ఆఖరి మ్యాచ్‌లో రాజస్తాన్‌పై గెలిచి పరువు నిలుపుకోవాలని యోచిస్తోంది. అయితే ఈ కీలక మ్యాచ్ లోనైనా రాజ్‌వర్ధన్‌ ని బరిలోకి దింపుతాడా లేదా అన్నది కాసేపట్లో తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl