అయితే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ దిగ్గజ జట్టుగా ఎలా కొనసాగుతుందో దేశవాళీ టోర్నీ అయిన రంజీ ట్రోఫీలో ముంబై జట్టు అదేరీతిలో దిగ్గజంగా కొనసాగుతోంది. ప్రతి ఏడాది కూడా మెరుగైన ప్రదర్శన చేస్తూ ముంబై జట్టు ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ఫైనల్కు దూసుకువస్తు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అందుకే ముంబై తో మ్యాచ్ అంటే చాలు ప్రత్యర్థులు భయపడిపోతుంటారు. ఇక ఇప్పుడు రంజీ ట్రోఫీలో భాగంగా ముంబై జట్టు మరోసారి సత్తా చాటింది. కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్లో ఉత్తరప్రదేశ్ పై విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది ముంబై జట్టు. ఇక అయిదేళ్ల తర్వాత ముంబై ఫైనల్ బెర్తును ఖాయం చేసుకోవడం గమనార్హం.
ఇక రంజీ ట్రోఫీ చరిత్రలో 47 వ సారి ఫైనల్లో అడుగుపెట్టింది ముంబై జట్టు. అయితే ఓవర్నైట్ స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 449 పరుగులు కాగా.. చివరి రోజు కొనసాగిన ఆటలో ముంబై 84 పరుగులు జోడించింది. దీంతో 533 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఇక తొలి ఇన్నింగ్స్ లో 213 పరుగుల ఆధిక్యం కలిపి మొత్తంగా ముంబై స్కోరు 746 కు చేరింది. ఇక ఆ తర్వాత ముంబై ముందంజ వేయడానికి ఖాయం కావడంతో యూపీ జట్టు రెండో ఇన్నింగ్స్ లో బరిలోకి దిగలేదు. గతంలో నలభై ఆరు సార్లు రంజీ ఫైనల్ చేరిన ముంబై 41 సార్లు టైటిల్ గెలుచుకుని ఐదుసార్లు రన్నరప్గా నిలిచింది. ఇప్పుడు 47 వ సారి ఫైనల్ లో అడుగుపెట్టిన ముంబై జట్టు కప్పు గెలుస్తుంది అని ఆ జట్టు అభిమానులు బలంగా నమ్ముతున్నారు.