ప్రస్తుతం ఓ టెస్టు కోసం ఇంగ్లాండ్‌ లో భారత్ పర్యటిస్తోంది. అంతకు ముందే లీసెస్టర్ కౌంటీ క్రికెట్ జట్టుతో టీమిండియా గురువారం నుంచి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ మ్యాచ్‌లో నలుగురు భారత క్రికెటర్లు ప్రత్యర్థి జట్టు తరుపున ఆడనున్నారు. ఛతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ కౌంటీ కెప్టెన్ సామ్ ఎవాన్స్ నేతృత్వంలో లీసెస్టర్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. బీసీసీఐ, ఈసీబీ, లీసెస్టర్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ (LCCC) మధ్య ప్రత్యేక ప్రీ-మ్యాచ్ ఏర్పాటు చేయడం ద్వారా భారత జట్టుకు తగిన ప్రాక్టీస్ కల్పించడమే దీని ఉద్దేశం. అయితే ప్రత్యర్థి జట్టులో భారత కీలక ఆటగాళ్లు ఉండడంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

భారతదేశం లో ఈ వార్మప్ మ్యాచ్ అధికారికంగా ప్రసారం చేయడం లేదు. అయితే అభిమానులు ఫాక్స్ టీవీ యూట్యూబ్ ఛానెల్‌లో దీన్ని చూడవచ్చు. అదే సమయంలో, అభిమానులు అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌ లో మ్యాచ్ యొక్క ప్రత్యక్ష స్కోర్‌లు, అప్‌డేట్‌లను పొందొచ్చు. గురువారం (జూన్ 23) మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు చూడని కొత్త పరిణామం ఈ మ్యాచ్‌లో కనిపించనుంది. భారత స్టార్ బౌలర్ బుమ్రా బౌలింగ్ పదును ఇప్పటి వరకు ప్రత్యర్థులు రుచి చూశారు. అయితే ప్రాక్టీస్‌ లో ఏవో కొన్ని బంతులను భారత క్రికెటర్లకు బుమ్రా వేసి ఉండొచ్చు. అయితే భారత జట్టుకు ప్రత్యర్థి టీమ్‌లో ప్రస్తుతం బుమ్రా ఉండడంతో ఆసక్తికరంగా మారింది. బుమ్రా వేసే పదునైన యార్కర్లు, బౌన్సర్లను భారత క్రికెటర్లు ఎలా ఎదుర్కొంటారనని అంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు తన బౌలింగ్‌తో ప్రత్యర్థులను బెంబేలెత్తించిన భారత క్రికెటర్లను ఎంతలా ఇబ్బంది పెడతాడోనని అంతా చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: