దశాబ్దకాలానికి పైగా పాకిస్థాన్లో పర్యటన పై నిషేధం విధించిన కొన్ని దేశాల జట్లు ఆంక్షలను సడలిస్తున్నాయి. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి వరుసగా వివిధ జట్లు పాకిస్థాన్ పర్యటనకు వెళుతూ ఉండడం.. అక్కడ వరుసగా సిరీస్లో ఆడుతూ ఉండటం లాంటివి చేస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలోనే దిగ్గజ ఇంగ్లాండ్ జట్టు కూడా కీలక నిర్ణయం తీసుకుంది. 17 ఏళ్ల తర్వాత తొలిసారిగా పాకిస్థాన్ పర్యటనకు సిద్ధమవుతోంది. ఇక ఈ పర్యటనలో భాగంగా పాకిస్థాన్తో ఏడు మ్యాచ్ల టీ20 సిరీస్ లో ఇంగ్లాండ్ తలపడనుంది.
ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ఇటీవల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఇక ఇరు జట్ల మధ్య సెప్టెంబర్ 20వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు కూడా టి20 సిరీస్ జరగబోతుంది. ఈ సిరీస్లోని తొలి నాలుగు మ్యాచ్ లూ కరాచీ నేషనల్ స్టేడియం వేదికగా జరగబోతున్నాయి. ఆఖరి మూడు మ్యాచ్ లకు లాహోర్లోని గడాఫీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది అనేది తెలుస్తుంది. అయితే గత ఏడాదే టి20 ప్రపంచకప్కు ముందు ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు ఇంగ్లాండ్ జట్టు పాకిస్థాన్లో పర్యటించాల్సి ఉన్నప్పటికీ ఆటగాళ్ల భద్రత నిమిత్తం చివరి నిమిషంలో పాకిస్థాన్ పర్యటన రద్దు చేసింది. కానీ ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారులూ సమావేశం అయ్యి చర్చించిన నేపథ్యంలో ఇప్పుడు పాకిస్థాన్ పర్యటనకు సిద్ధమైంది ఇంగ్లండ్ జట్టు.