ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు గత ఐదేళ్లలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పార్టీ అధికారంలో ఉండడంతో ఆయనతో పాటు ఆయన మందీమార్బలంలో ఉన్న వాళ్లు ఆడింది ఆట పాడింది పాట అయ్యింది. అసలు ఆయన్ను అడిగేవారు లేరు. పార్టీలోనూ.. ప్రభుత్వంలోని లోపాలను సొంత పార్టీ నేతలో లేదా ఎమ్మెల్యేలో ఎవరైనా బాబుకు చెపితే వాళ్లంతా చెడ్డోళ్లు.... బాబుకు భజన చేసే వాళ్లే మంచోళ్లయ్యారు. అయితే గత ఎన్నికల్లో పార్టీ చిత్తు చిత్తుగా ఓడడంతో ఇప్పుడు వాళ్లంతా అదను చూసుకుని బాబుపై సైటైర్లు వేస్తున్నారు. వల్లభనేని వంశీ, కరణం బలరాం లాంటి నేతలను చంద్రబాబు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు వాళ్లంతా బాబుకు షాక్ ఇచ్చి తమదారి తాము చూసుకున్నారు.
అంతెందుకు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేఈ. కృష్ణమూర్తి లాంటి వాళ్లనే చంద్రబాబు పక్కన పెట్టారు. ఆయన పార్టీకి ఎంతో నిబద్ధతతో పనిచేశారు. అయితే యనమల రామకృష్ణుడు లాంటి ప్రజలు మర్చిపోయి.. ప్రజా బలం లేని నేతలు చంద్రబాబుకు భజన చేయడంతో వాళ్లను ఓ రేంజ్లో నెత్తిన పెట్టుకున్నారు. అందుకే తునిలో వరుసగా ఓడిపోతున్నా యనమలను ఎమ్మెల్సీని చేసి మరి ఆయనకు ఆర్థిక మంత్రి పదవి ఇచ్చారు. ప్రజల్లో బలం లేని... ఓ అవుట్డేటెట్ లీడర్ అయిన యనమల ఐదేళ్ల పాటు కనపడని అరాచకాలు చేశారన్న అపవాదు ఎదుర్కొన్నారు.
చివరకు కొన్ని నియోజకవర్గాల్లో టిక్కెట్ల ఎంపికల్లో కూడా ఇష్టమొచ్చినట్టు వ్యవహరించడంతో పాటు పార్టీ పతనానికి తన వంతుగా కృషి చేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి. కొన్ని రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో గెలిచే వాళ్లను పక్కన పెట్టడం... తన కులం వాళ్లు వైసీపీలోకి వెళుతున్నా తనకేం పట్టనట్టుగా వ్యవహరించడం... చివరకు ఎన్నికలకు ముందు తెలంగాణ మంత్రి తలసాని టీడీపీకి చాలా నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినా కూడా యనమల మౌనంగా ఉన్నారు. అంతకుముందు కూడా కొన్ని విషయాల్లో ఆయన పార్టీకి వ్యతిరకంగా ధర్నాలు, నిరసనల వెనక ఉన్నారన్న అపవాదు కూడా ఎదుర్కొన్నారు.
అయినా చంద్రబాబు ఆయన్నే నమ్మారు. చివరకు ఆయన సొంత జిల్లా తూర్పుగోదావరిలో పార్టీకి ఘోరమైన పలితాలు వచ్చాయి. మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప గెలిచి తానేంటో ఫ్రూవ్ చేసుకున్నారు. యనమల మాత్రం సొంత నియోజకవర్గంలో మూడోసారి ఘోరంగా ( ఓసారి తాను.. రెండుసార్లు తన తమ్ముడు ) ఓడారు. అయినా అలాంటి యనమలనే ఇప్పుడు కూడా చంద్రబాబు నమ్ముతుండడంతో పార్టీ వర్గాలకు మంటగా మారింది. చంద్రబాబు యనమలను ఫుల్లుగా నమ్మి నిండా మునిగారు. అందుకే మైదుకూరులో ముందే ఓడిపోతాడని తెలిసినా యనమల బంధువు పుట్టా సుధాకర్ యాదవ్కు సీటు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ఆయన్నే నమ్మి మళ్లీ నిండా మునిగేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా ? అని పార్టీ వాళ్లు సెటైర్లు వేసుకుంటున్నారు.