ఆమధ్య అంటే 2015, మే నెలలో హైదరాబాద్ లో బయటపడిన ’ఓటుకునోటు’ కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.  ఘటన జరిగి సంవత్సరాలైపోయినా ఆ కేసు గురించి ఇంకా జనాలు మాట్లాడుకుంటునే ఉంటారు. కారణం ఏమిటంటే ఆ కేసుకు కేంద్రబిందువు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు కావటమే. అప్పట్లో తెలంగాణాలో  ఎంఎల్సీ ఎన్నికలు జరిగాయి. నిజానికి ఆ ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోయినా వేం నరేంద్రరెడ్డి అనే నేతను చంద్రబాబు పోటిలోకి దింపాడు.   ఓట్లు, గెలుపు అవకాశం లేకపోయినా పోటిలోకి ఎందుకు దింపాడు ?

 

ఎందుకంటే ప్రత్యర్ధుల ఓట్లను కొనుగోలు చేసి గెలవాలన్న వ్యూహం ప్రకారమే అభ్యర్ధిని పోటిలోకి దింపాడు. చంద్రబాబు ఉద్దేశ్యంలో  తాను మాత్రమే మహా మేధావి, అపర చాణుక్యుడు. ప్రత్యర్ధుల్లో కూడా తెలివైన వాళ్ళుంటారని అనుకోవటానికి కూడా చంద్రబాబు ఇష్టపడడు. కానీ అప్పటి ఎన్నికల్లో చంద్రబాబు ఎత్తుకు కేసీయార్ పై ఎత్తు వేసి చంద్రబాబును మట్టి కరిపించేశాడు. నామినేటెడ్ ఎంఎల్ఏ ఓటును కొనుగోలు చేసేందుకు చంద్రబాబు వేసిన ప్లాన్ ను దెబ్బతీయటం ద్వారా చంద్రబాబు కుట్రలను, నిజస్వరూపాన్ని యావత్ దేశానికి కేసియార్ పరిచయం చేశాడు. నిజానికి చంద్రబాబు రాజకీయ జీవితంలో డౌన్ ఫాల్ మొదలైంది అప్పటి నుండే.

 

సరే ఇదంతా ఇపుడెందుకంటే గెలుపు అవకాశం లేకపోయినా రాజ్యసభ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధిగా వర్ల రామయ్యను చంద్రబాబు మళ్ళీ పోటీలోకి దింపాడు. పోటీలోకి ఎందుకు దింపాడంటే టిడిపి నేతలే ఎవరూ సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే రాజ్యసభ ఎంపిగా గెలవాలంటే 35 మంది  ఎంఎల్ఏలు ఓట్లేయాలి. అసెంబ్లీలో బలం ప్రకారం నాలుగు స్ధానాలు గెలిచే అవకాశం వైసిపికి మాత్రమే ఉందన్న విషయం ప్రతి ఒక్కళ్ళకు తెలుసు. అదే సమయంలో టిడిపికి ఉన్న బలం 23 మంది ఎంఎల్ఏలు మాత్రమే.

 

టిడిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏల్లో కూడా ముగ్గురు ఎంఎల్ఏలు దూరమైపోయారు. అంటే ఇక మిగిలింది కేవలం 20 మంది ఎంఎల్ఏలే. వీళ్ళల్లో కూడా వర్ల రామయ్యకు ఎంతమంది ఓట్లేస్తారో తెలీదు. అసలు ఓటింగ్ కు ఎంతమంది వస్తారో కూడా తెలీదు. ఎందుకంటే రాజ్యసభ ఎన్నికల్లో విప్ జారీ చేసేందుకు లేదు. కాబట్టి ఎంఎల్ఏలను భయపెట్టి ఓట్లేయించుకునే ప్రయత్నం కూడా చెల్లుబాటు కాదు. మరి ఈ పరిస్ధితుల్లో వర్ల ను ఎందుకు పోటిలోకి దింపినట్లు ?

 

అంటే అప్పట్లో ప్రత్యర్ధి పార్టీ ఓట్లు కొనుగోలు చేయటానికి ప్లాన్ చేసినట్లే ఇప్పుడు కూడా వైసిపి ఓట్లకు ఏమన్నా చంద్రబాబు గాలం వేస్తున్నాడా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. వైసిపి నుండి టిడిపికి ఓట్లు పడే అవకాశలు లేనప్పటికీ చంద్రబాబు అయితే ప్రయత్నాలు చేయగల ధిట్టే అనటంలో సందేహాలు లేవు. ఏదో రూపంలో ప్రత్యర్ధులను ప్రలోభాలకు గురిచేయటానికి చంద్రబాబు శాయసక్తుల ప్రయత్నిస్తాడనేందుకు చరిత్రే సాక్ష్యం.

 

అసలు ఎస్సీ అభ్యర్ధిని రంగంలోకి దింపటంలో చంద్రబాబు వ్యూహం కూడా ఇదే అనే అనుమానలున్నాయి. దానికితోడు అభ్యర్ధి వర్ల రామయ్య కూడా ఆత్మప్రబోధమంటూ డ్రామాలు మొదలుపెట్టేశాడు. కాబట్టి చంద్రబాబు ప్రయత్నాలపై అధికారపార్టీ ఓ కన్నేసుండాల్సిన అవసరమైతే ఉందనటంలో సందేహమే లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: