రవి గాంచని చోటును కవి గాంచును అన్న పదానికి నిదర్శనమే రావూరి భరద్వాజ. తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే రచనలు చేశారు ఆ మహానుభావుడు. పాకుడురాళ్లు ఆయన రచనల్లో అత్యంత గొప్పది..ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. ఆయన రచనలు విభిన్నం. ఆయన దృష్టికోణం,పరిశీలనా అనుభవాన్ని కథలుగా మలిచిన తీరు అద్భుతం. అంతిమంగా మాత్రం సమాజంలో యధార్థ జీవితాలకు దగ్గరగా...మనిషిలోని వివిధ స్వభావాలను కళ్లకు కట్టే విధంగా ఆయన నవలల్లోని పాత్రలు ఉండటం విశేషం. మొదట్లో చలం ప్రభావం ఆయనపై ఎంతో ఉండేంది. రావూరి భరద్వాజ చిన్నతనంలో పల్లెటూరిలో పెరిగాడు. బుద్ది ఎరిగిన నాటి నుంచి సమజాన్ని పరిశీలించడం మొదలు పెట్టాడు. దాని పోకడను, పేదల కష్టాలను, భాష, యాసను గమనించాడు.
రావూరి భరద్వాజ 1927 జూలై 5వ తేదీన కృష్ణా జిల్లా లోని నందిగామ తాలూకా కంచికచర్ల సమీపంలోని మోగులూరు గ్రామంలో రావూరి కోటయ్య, మల్లికాంబ దంపతులకు జన్మించారు. 1946లో నెల్లూరులోని జమీన్ రైతు వారపత్రిక సంపాదకవర్గంలో చేరాడు.1948లో దీనబంధు వారపత్రికకు బాధ్యుడుగా ఉన్నాడు. జ్యోతి,సమీక్ష, అభిసారిక, చిత్రసీమ, సినిమా, యువ పత్రికల్లో 1959వరకు కొన్నాళ్ళు ఫౌంటెన్ పెన్నుల కంపెనీలో సేల్స్మన్గా పనిచేశాడు. అక్కడ యజమాని అమానుషత్వాన్ని భరించలేక రాజీనామా చేసి కొన్నాళ్ళపాటు ఖాళీగా ఉన్నాడు. ఆ తర్వాత హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో 1959లో ప్రూఫ్ రీడింగ్ కళాకారునిగా చేరి చివరకు 1987లో ప్రసంగ కార్యక్రమాల ప్రయోక్తగా పదవీ విరమణ చేశాడు.
రావూరి భరద్వాజ తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, రేడియోలో రచయితగా పేరుతెచ్చుకున్నాడు. గొప్ప భావుకుడైన తెలుగు కవి, రచయిత. రావూరి భరద్వాజ 37 కథా సంపుటాలు, 17 నవలలు, 6 బాలల మినీ నవలలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస, ఆత్మకథా సంపుటాలు, 8 నాటికలు, ఐదు రేడియో కథానికలు రచించాడు. సినీ పరిశ్రమలో తెరవెనుక జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చిత్రీకరించిన పాకుడు రాళ్ళు నవల భరద్వాజ రచనల్లో ఎంతో ఉత్తమమైనదిగా పరిగణింపబడుతుంది. జీవన సమరం మరో ప్రముఖ రచన.
ఆడంబరాలులేని సాధారణ జీవితం ఆయనది. భరద్వాజకు దిగువ మధ్యతరగతి, పేదప్రజల భాషపై గట్టిపట్టు ఉంది. ఒక బీదకుటుంబంలో జన్మించిన భరద్వాజ కేవలం ఉన్నత పాఠశాల స్థాయివరకే చదువుకున్నాడు. ఆతరువాత కాయకష్టం చేసే జీవితాన్ని ప్రారంభించాడు. చిన్నతనంలో పొలాల్లో గడిపిన భరద్వాజ వ్యవసాయ కూలీల కఠినమైన జీవన పరిస్థితులను గమనించేవాడు. అప్పుడే పల్లెప్రజల భాష, యాస, ఆవేశాలు, ఆలోచనలు, కోపాలు, తాపాలు గమనించిన భరద్వాజ ఆ అనుభవాలను తర్వాతకాలంలో తన రచనలలో నిజమైన పల్లె వాతావరణాన్ని సృష్టించడానికి ఉపయోగించుకున్నాడు. 2013 అక్టోబరు 18న రావూరి భరద్వాజ తిరిగిరాని లోకాలకు తరలివెళ్ళారు.
రావూరి భరద్వాజకు 1980లో ఆంధ్ర విశ్వవిద్యాలయం, 1987లో జవర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, 1991లో నాగార్జున విశ్వవిద్యాలయం గౌర్రవ డాక్టరేట్లు ప్రదానం చేసి గౌరవించాయి.
1980 - కళాప్రపూర్ణ - ఆంధ్ర విశ్వవిద్యాలయం.
1983 - కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం.
1985 - సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం ఇనుక తెర వెనకకు లభించింది.
1987 - రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు
1987 - తెలుగు కళాసమితి కె.వి.రావు, జ్యోతిరావు అవార్డు
1997లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్యలో విశిష్ట పురస్కారం
2007 - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న అవార్డు
2008 - లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం (వినూత్న సాహితీ ప్రక్రియ కల్పించినందుకు, డిసెంబరు 4 వ తేదీన ప్రకటించారు)
2011 - కేంద్ర సాహిత్య అకాడమీ, వంగూరి ఫౌండేషన్, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారాలు.
2012 - జ్ఞానపీఠ అవార్డు తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన బహుముఖమైన కృషికి దక్కింది.