ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో అధ్యాపకులుగా చేరి, తరువాత 1946లో ఆ శాఖకు అధ్యక్షులై, 1964లో పదవీ విరమణ చేశారు. వీరి కాలంలో తెలుగు శాఖ బాగా అభివృద్ధి చెంది, తెలుగు ఎం.ఎ. చదివే విద్యార్ధుల సంఖ్య పెరిగి, 1952 నుండి తెలుగులో పి.హెచ్.డి. పట్టాలకు పరిశోధన ప్రారంభమైంది. వీరు ఆంధ్ర మహాభారతం పరిశోధన ప్రతిని ఎనిమిది సంపుటాలుగా తెలుగు శాఖ పక్షాన ప్రకటించారు. వివేకానంద ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో ఒక విద్యాసంస్థను ప్రారంభించి బాలబాలికలకు వేరువేరుగా ఉన్నత పాఠశాలలను నెలకొల్పారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రథమంగా ప్రాచ్య కళాశాలను, తెలుగు మీడియం సాయం కళాశాలను, ఒక సంగీత పాఠశాలను నెలకొల్పి, వాటికి విశాలమైన భవనాలు కట్టించారు.
తన ఇంటిలోనే వేదపాఠశాలను 1980లో స్థాపించి సర్వ వర్ణాల వారికి తానే వేదాన్ని బోధించరు. ఆంధ్ర రచయితల సంఘానికి 1957లో అధ్యక్షులై అనేక గ్రంథాలను ముద్రించారు. వీరు ఇంగ్లీషు, తెలుగు భాషలలో శరవేగంగా రాసేవారు. మద్రాసు మెయిల్, దక్కన్ క్రానికల్, భారతి, కృష్ణా, స్రవంతి మొదలైన పత్రికలలో అనేకమైన వ్యాసాలు ప్రకటించారు. కొమర్రాజు లక్ష్మణరావు గారి విజ్ఞాన సర్వస్వం ముద్రించడంలో వీరు విశిష్టమైన కృషిచేశారు. వీరు 'ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహము' అనే చక్కని రచన చేశారు. సోదరుడు ఖండవల్లి బాలేందు శేఖరంతో కలసి తెలుగులోను, ఇంగ్లీషులోను రచించిన 'ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి' అమూల్యమైన గ్రంథం. వీరు జూన్ 18, 1986 తేదీన పరమపదించారు.