కొత్త కొత్త యాప్లతో ప్రజలు టెక్నాలజీని తెగ వాడేస్తున్నారు. ఇప్పటికే టిక్ టాక్, షేర్ చాట్ వంటి యాప్లను వినియోగించే వారి సంఖ్య భారీగా పెరిగింది. సోషల్ నెట్ వర్కింగ్ యాప్ టిక్ టాక్ విపరీతంగా పాపులర్ అయ్యింది. ఆడ, మగతో తేడాలేకుండా వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది టిక్ టాక్ కు బానిసలయ్యారు. కొందరు యువతీ యువకులు ఈ పిచ్చిలో పడిపోయి తమ ప్రాణాలకే ముప్పు తెచ్చుకుంటున్నారు. మరి కొందరు తాము చేసే విధులను కూడా పక్కన పెట్టి టిక్ టాక్ వీడియోలు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
మరోవైపు ప్రస్తుతం టిక్ టాక్తో అటు ఫేస్బుక్, ఇటు వాట్సాప్ రెండింటికీ గట్టి పోటీ ఇస్తోంది. దీనికి తోడు… హెలో, రోపోసో, షేర్ చాట్ లాంటివి కూడా వీడియోలతో నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలు ఫేస్ బుక్ని దాదాపు మర్చిపోతున్నారు. వాట్సాప్ కూడా ఎప్పుడో ఓసారి అలా చూసి ఇలా క్లోజ్ చేస్తున్నారు. ఈ పోటీని తట్టుకోవాలంటే టిక్ టాక్ లాంటిదే ఓ యాప్ తేవాలనే ఆలోచనలో ఫేస్ బుక్ ఉన్నట్లు తెలుస్తోంది. సరికొత్త యాప్ను ప్రవేశపెట్టబోతున్నట్లు ఫేస్ బుక్ ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేకించి న్యూ ప్రొడక్ట్ ఎక్స్పెరిమెంటేషన్ (NPE) టీంని ఏర్పాటు చేసింది. ఇందుకోసం యూఎక్స్ డిజైనర్లు, ఇంజినీర్లు వర్క్ చేస్తున్నారు. త్వరలోనే టిక్ టాక్ తరహా యాప్ ఫేస్బుక్ నుంచి రానుంది. ఫేస్బుక్ ప్రవేశపెట్టబోయే కొత్త యాప్ ఏ విధంగా అలరిస్తుందో వేచి చూడాల్సిందే.
కాగా, ఫేస్బుక్కు అమెరికా నియంత్రణ సంస్థ భారీ జరిమానా విధించింది. వినియోగదారుల వ్యక్తిగత భద్రత వైఫల్యాలపై దర్యాప్తును ఎదుర్కొంటున్న ఫేస్బుక్కు ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఇంత భారీ స్థాయిలో జరిమానా విధించింది. దర్యాప్తు సెటిల్మెంట్లో భాగంగా ఫేస్బుక్ 5 బిలియన్ డాలర్లు(అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 34వేల కోట్లు) చెల్లించేందుకు ఫెడరల్ ట్రేడ్ కమిషన్ 32 ఓట్లతో అంగీకరించింది. దీనికి సంబంధించి వాల్ స్ట్రీట్ జర్నల్ లో తెలిపింది. అయితే ఇంత భారీ స్థాయిలో జరిమానా విధించడం ఇదే మొదటి సారి. ఈ సెటిల్మెంట్ను అమెరికా న్యాయశాఖ అంగీకరించాల్సి ఉంది.