దేశంలోనే పేరొందిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆస్తిపన్ను వసూళ్లలో ఉన్న లోపాలను సవరించడం ద్వారా ఆదాయాన్ని పెంపొందించేందుకు జీహెచ్ఎంసీ భారీ ప్రణాళికలు చేస్తోంది. భవన నిర్మాణ అనుమతులను రెవెన్యూ విభాగానికి కలపడం ద్వారా నిర్మాణం పూర్తి అయిన వెంటనే ఆస్తిపన్ను విధించేలా చర్యలు చేపట్టడం, మదింపులో వ్యత్యాసాలను సరిచేయడంతో పాటు ఇంకా అనేక చర్యల ద్వారా ఆదాయ మార్గాలను పెంపొందించుకోనున్నట్టు కమిషనర్ లోకేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో జోనల్, డిప్యూటీ కమిషనర్లతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ జరిపారు. ఈ నెల 3వ వారం నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఆస్తిపన్ను మదింపును పకడ్బందీగా చేపడుతామని అయన తెలియ చేశారు. డీపీఎంఎస్ జీహెచ్ఎంసీ రెవెన్యూ విభాగానికి అనుసంధానం చేయనున్నట్టు అయన తెలిపారు. ముఖ్యంగా 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని మరింత కఠినంగా అమలు చేయనున్నట్టు కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్లో గణేష్ విగ్రహాల నిమజ్జనాలకు నిర్మించిన ప్రత్యేక కొలనులను దోమల నివారణకు ఉపయోగపడే గంబూసియా చేపల ఉత్పత్తి కేంద్రాలుగా చేయనున్నట్టు కమిషనర్ ఈ విషయంలో తెలిపారు.
ఈ మధ్య వరుసగా వర్షాలు కురవడంతో పలు మార్గాల్లో రోడ్లు దెబ్బతిన్నాయని, ఇంకా 160కు పైగా మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలతో మరమ్మతులు చేయిస్తున్నామని తెలియ చేశారు. ఇంకా నాలాల విస్తరణకు ఆస్తుల సేకరణను వేగవంతం చేస్తామని అని అయన అన్నారు.
గ్రేటర్ హైదరాబాద్లో చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే వేస్ట్ టు ఎనర్జీ విద్యుత్ ప్లాంట్ ప్రారంబోత్సవానికి సిద్ధంగా ఉందని అయన తెలిపారు. అయితే ఆ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ధరను నిర్ణయించాల్సిన ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమీషన్ ఏర్పాటు అయిన వెంటనే ధరను నిర్ణయిస్తుందని, ఆ వెంటనే ఈ ప్లాంట్ను ప్రారంభించే అవకాశముందని అయన అన్నారు.