రావణుడిపై యుద్ధానికి వెళ్లే ముందు శ్రీరాముడు శమీ పూజ చేసినట్లు రామాయణం ద్వరా తెలుస్తోంది. ద్వాపరయుగంలో అజ్ఞాత వాసానికి వెళ్లేముందు పాండవులు తమ ఆయుధాలను జమ్మిచెట్టుపైనే ఉంచి అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత విజయ దశమినాడు ఉత్తర గోగ్రహణం కోసం అర్జునుడు శమీ వృక్షాన్ని పూజించి గాండీవాన్ని ధరించి అద్భుత విజయాన్ని అందుకున్నట్లు మహాభారతం చెప్తోందియ. దసరా రోజు శమీ పూజ చేసేవారికి అమ్మవారి కృప లభించటమే గాక శనిదోష నివారణ జరుగుతుందట.
దసరా సాయంత్రం వేళ ఆలయాలు, చెరువుల వద్ద ఉండే జమ్మి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షణలు చేస్తారు. శాస్త్రోక్తంగా జమ్మిని పూజించి జమ్మి ఆకును ప్రసాదంగా స్వీకరిస్తారు. దీనిని బంగారంగా భావించి పెద్దలు, కుటుంబ సభ్యులకు ఇచ్చి నమస్కరిస్తారు. తాము అందుకొన్న జమ్మి ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో, ధనస్థానంలో దాచుకోవటం శుభప్రదం.
ఇష్ట దర్శన మృష్టాన్నం కష్ట దారిద్య్ర నాశనం అనే ఈ శ్లోకాన్ని చెప్తూ శమీపూజ చేయాలని పెద్దలంటారు.
అంతేగాకుండా.. దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు ఆవిర్భవించిన దేవతా వృక్షాల్లో శమీవృక్షమూ ఉంది. నాడు శమీవృక్షంతోబాటు ఆవిర్భవించిన తులసి, పారిజాత, బిల్వ వృక్షాలకు వనమాలి అనే ఓ అధిష్టాన దేవత ఉందనీ, ఆమెనే శమీ దేవత అంటారు. వినాయక పూజలో జమ్మి ఆకును ఉపయోగిస్తారు. త్రేతాయుగాన వనవాససమయంలో శ్రీరాముడు కుటీరాన్ని జమ్మి చెట్టు కలపతోనే నిర్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి.