దసరా నే "విజయదశిమి" అనికూడా అంటారు.ఈ పండగ హిందువుల ముఖ్యమైన పండుగ కొలుస్తారు.ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ.ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు.ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు.


దసరా పండుగ ఆశ్వయుజ శుద్ధ దశమి తిధి రోజు శ్రవణా నక్షత్రంతో కలిసిన రోజునాడుదసరా పండగ జరుపుకోవడం జరుగుతుంది.తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణాలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుండి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు.తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ.


విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై బద్రపరచుకున్న తమ ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజు.ఈ సందర్భమున రావణవధ, జమ్మి ఆకుల పూజా చేయటం ఆనవాయితీగా వస్తుంది.జగన్మాత అయిన దుర్గా దేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు అదే విజయదశమి.దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశములో హెచ్చుగా ఉంటుంది.


కలకత్తా ఉత్సవాలలో ప్రతిష్ఠించిన మహిసాసుర మర్దిని దుర్గామాత విగ్రహం దైత్యవంశానికి ఆశాదీపంలా జన్మించిన 'మహిషాసురుడు' తన ఆంతరంగిక మిత్రులతో సచివులతో సమాలోచన చేసి మరణంలేని జీవనం కోసం మేరుపర్వతశిఖరం చేరి బ్రహ్మదేవుని గూర్చి ఘోరతపస్సు ప్రారంభించాడు.కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్లిపోయాయి.


మహిషాసురుని అచంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహిషాసురా ఇంక తపస్సు చాలించి ఏ వరం కావాలో కోరుకో అన్నాడు.పితామహా నేను అమరుణ్ణి కావాలి.నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు మహిషాసురుడు. అప్పుడు బ్రహ్మదేవుడు మహిషాసురా పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు గిట్టిన ప్రాణి మరల పుట్టక తప్పదు. జననమరణాలు సకల ప్రాణి కోటికి సహజ ధర్మాలు.


మహాసముద్రాలకూ,మహాపర్వతాలకూ కూడా ఏదో ఒక సమయంలో వినాశం తప్పదు.ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం కనుక నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి మరే వరమైనా కోరుకో అన్నాడు.అప్పుడు మహిషాసురుడు విధాతా అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడ్డాడు సరే ఆడది నా దృష్టిలో అబల ఆమెవల్ల నాకే ప్రమాదమూ రాదు.కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్థానమయ్యాడు.


బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్దం చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు.దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది.త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది.


శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె18 బాహువులను కలిగి ఉంది.ఆమెకు శివుడు శూలమును,విష్ణువు చక్రమును,ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు.ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరుసల్పింది. మహిషాసురుని తరఫున పోరు సల్పుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది.


ఈ యుద్ధములో ఆదేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది.దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము, మానవరూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు.ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా ప్రజలచే కొనియబడింది.


ఈ రోజులలో వివిధ దేవుళ్ళ వేషధారణ చేసి ఇంటింటికి తిరిగి గృహస్తులు ఇచ్చినది పుచ్చుకోవడం కొందరు వృత్తిగా ఆచరిస్తారు. వీటిని దసరా వేషాలు లేదా పగటి వేషాలు అంటారు.ప్రాథమిక పాఠశాల ఉపాద్యాయులు విద్యార్థులను వెంట పెట్టుకొని విద్యార్థుల అందరి ఇళ్ళకు వెళ్ళి మామూలు పుచ్చుకోవడం మామూలే. ఈ సమయంలో వెదురు కర్రతో చేసి రంగు కాగితాలతో అలంకరించిన బాణాలు విద్యార్థులు పట్టుకుని అయ్యవారి వెంట వస్తారు.


విద్యార్థులు ఏదయా మీ దయా మామీద లేదు, ఇంత సేపుంచుటా ఇది మీకు తగునా.అయ్యవారికి చాలు అయుదు వరహాలు, పిల్ల వాళ్ళకు చాలు పప్పు బెల్లాలు అంటూ రాగయుక్తంగా పాడుకుంటూ అయ్యవారి వెంట వస్తారు.గృహస్తులు అయ్యవారికి ధన రూపంలోనూ, పిల్ల వాళ్ళకు పప్పు బెల్లం రూపంలోనూ కానుకలు ఇస్తారు.సంవత్సర కాలంలో సేవలందిచిన వారు గృహస్తును మామూళ్ళు అడగటం వారు కొంత ఇచ్చుకోవడమూ అలవాటే.దీనిని దసరా మామూలు అంటారు.కొత్తగా వివాహం జరిగిన ఆడపడచుని భర్తతో సహా ఇంటికి ఆహ్వానించి అల్లుడికీ కూతురికీ నూతన వస్త్రాలు కానుకలు ఇచ్చి సత్కరించడం కూడా అనావాయితిగా వస్తుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: