ఇంట్లో శుభకార్యం....ముఖ్యంగా వివాహ సందర్భంలో దైవానుగ్రహం కావాలి అని అందరు కోరుకుంటారు. కొందరు మొదటి శుభలేఖను దేవుడి సన్నిధిలో సమర్పించి...స్వామి వారి ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు. కానీ వివాహ వేడుక సమయంలో కొంత మంది తిరుమల వెంకన్న ఆశీస్సుల కోసం తిరుపతి వెళ్లి మరి శుభలేఖలు సమర్పిస్తారు. కానీ కొంత మందికి అలా వెళ్లి ఆశీస్సులు తీసుకోవడం కుదరదు. అటు వంటి వారి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.
కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులకు శ్రీవారికి నిర్వహించే
నిత్య కళ్యాణంలో వినియోగించే పవిత్ర తలంబ్రాలను అందజేయనున్నారు. ఈ పథకం వివాహం కాగానే కొత్త జంటలు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందడాన్ని మరింత సులభ సాధ్యం చేస్తోంది. శ్రీవారి ఆశీర్వచనం కావాలనుకునే వారు పెళ్లికి ముందు మీ పెళ్లి పత్రికను పోస్టు ద్వారా
టీటీడీకి పంపించాల్సి ఉంది. నవ దంపతులకు సకల మంగళాలు కలగాలని ఆకాంక్షిస్తూ....శ్రీవారి కల్యాణ తలంబ్రాలు, కుంకుమ, కంకణాలు, కల్యాణ సంస్కృతి పుస్తకాన్ని పోస్టులో పంపిస్తారట.
ఉపద్రవాల నుంచి రక్షాబంధనంగా భావిస్తూ
వధూవరులు కల్యాణంలో తొలి ఘట్టంగా కంకణధారణ చేస్తారు. ఇందుకు ప్రతీకగా.శ్రీపద్మావతి అమ్మవారి ఆశీస్సులతో కూడిన కుంకుమను, కంకణాన్ని పంపుతారు. టీటీడీ పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి సముద్రాల లక్ష్మణయ్య రచించిన ‘కల్యాణ సంస్కృతి’ పేరిట ఓ పుస్తకాన్ని, టీటీడీ ఈవో పేరిట వేద ఆశీర్వచనం పత్రికను కొత్త జంటలకు పంపుతారు.
ఇవి వివాహ వ్యవస్థ ఔన్నత్యాన్ని తెలియజేస్తాయి. ఇవి కనీసం ఒక పది వేల మందికి పంపించాలి అని టీటీడీ నిర్ణయించుకుంది. భక్తులు మీ పూర్తి చిరునామాను ఈ కింద ఉన్న చిరునమాకి శుభలేఖ పంపితే చాలు మీకు శ్రీవారి కల్యాణ తలంబ్రాలు ఇంటికి వస్తాయి ,మరిన్ని వివరాలకు కాల్ సెంటరును 0877- 2233333, 2277777 ఫోన్లలో సంప్రదించాలని టీటీడీ సూచించింది.తిరుమల తిరుపతి దేవస్థానం వారి పంపేవి మీకు చేరడానికి కొంచం సమయం పట్టవచ్చు గమనించగలరు