ఒకనాడు కైలాసంలో పరమ శివుని పార్వతీదేవి,  " నాధా ! మానవ లోకములో కొంతమంది సుఖసంతోషాలతో సిరిసంపదలతో తులతూగుతుంటారు. సుఖాలను అనుభవిస్తుంటారు. కాని కొంతమంది దరిద్రంతో బాధపడుతుంటారు. దీనికి కారణం ఏమిటి ? " అని అడిగింది పార్వతి. 
అందుకు సమాధానంగా  పరమశివుడు " గతజన్మలో కాకులకు కూడా మెతుకులు పెట్టకుండా పిడికెడు భిక్షము వెయ్యకుండా పిసినారిగా గడిపిన వాడికి ఈ జన్మలో దారిద్ర్యంచుట్టుకుంటుంది. తినడానికి తిండి కట్టడానికి బట్టలేక బాధపడతాడు. అలా కాక పేదవారికి అన్నపానములు ఇచ్చిన వాడికి తన బంధువులను స్నేహితులను కష్టకాలంలో ఆదుకున్నవాడికి మరుజన్మలో సిరిసంపదలు కలుగుతాయి. సుఖంగా జీవిస్తారు. కనుక సుఖదుఃఖములు వారి వారి పూర్వజన్మ కర్మపరిపక్వత వలన కలుగుతుంది. అంతేకాని బ్రహ్మదేవుడికి ఒకరి మీద ప్రేమ మరొకరి మీద ద్వేషము ఉండదు. దేవుడు ఎవరిని పేదవాడుగా పుట్టించడు. ఎవరైనా ఈ జన్మలో పేదవాడుగా జన్మించి కష్టములు అనుభవిస్తున్నాడంటే అది అతడు పూర్వజన్మలో చేసిన పాపములఫలము అని తెలుసుకోవాలి. 


పార్వతీ ! కొంత మందికి సంపదలు ఉంటాయి కాని వారు కడుపునిండా తినరు, అనుభవించరు అలా సంపదఉన్నా దరిద్రము అనుభవిస్తుంటారు. ఎందుకో తెలుసా ! వీరు పూర్వ జన్మలో ఎవరికీ పిడికెడు అన్నము పెట్టి ఉండరు. బంధువులు, మిత్రులు పోరగా బలవంతంగా పరులకు ఉపకారం చేసి ఉంటారు. అలాంటి వారు సిరిసంపదలు ఉన్నా అనుభవించలేరు.కొంతమంది తమకు ఏమీ లేకపోయినా బంధుమిత్రుల సహాయంతో తిండికి గుడ్డకు లోటులేకుండా జీవిస్తుంటారు. అలాంటి వారు పూర్వజన్మలో తమకు శక్తి లేకపోయినా ఇతరులకు దానధర్మములు చేయవలెనని మనసులో ఘాఢంగా కాంక్షిస్తుంటాడు. అందువలన ఈ జన్మలో కూటికి గుడ్డకు లోటు లేకుండా జీవిస్తుంటారు. 


ఈ జన్మలో కొంతమంది అయాచితంగా ధనము లభిస్తుంది. అలాంటి వారు పూర్వజన్మలో పేదలకు అన్నదానము, ధనరూప దానము, వస్త్రదానము చేసి ఉంటారు. ఈ జన్మలో శ్రమతో ధనము సంపాదించే వారు పూర్వ జన్మలో ఎవరిని తిప్పించుకోకుండా పేదవారు అడగగానే దాన ధర్మములు చేసినవారు.కొంతమందికి ఎంత శ్రమపడ్డా ధనముచేకూరదు. అలాంటి వారు పూర్వజన్మలో లోభులై తమను యాచించిన వారిని రేపురా మాపురా అని తప్పించుకుని చివరకు మొండిచెయ్యి చూపి ఉంటారు. కొంతమంది తమకు మిక్కుటంగా ధనము కలిగినప్పటికీ వారికి ఉన్న రోగముల చేత తిండికూడా తినలేని స్థితిలో ఉంటారు. అలాంటి వారు పూర్వజన్మలో మంచిస్థితిలో ఉన్నప్పుడు దానము చేయకుండా వ్యాధిపీడితుడైన తరువాత దానధర్మములు చేసి ఉంటారు. 
ఈ జన్మలో అందంగా ఉన్నవారు పూర్వజన్మలో శాకాహారం తిన్నవారు. 


ఈ జన్మలో కురూపులుగా ఉన్నవారు పూర్వజన్మలో అందగాళ్ళై కురూపులను ఎగతాళి చేసి బాధించిన వారై ఉంటారు. పూర్వజన్మలో ఏకపత్నీవ్రతుడై ఉన్న వాడికి ఈ జన్మలో సౌందర్యవతీ, సౌశీల్యవతీ, గుణవతీ అయిన భార్య లభిస్తుంది. అలా కాక భార్యను కష్ట పెట్టినవాడికి ఈ జన్మలో భార్యాసుఖం దూరమౌతుంది. ఈ జన్మలో విద్యా, విజ్ఞానము, జ్ఞానము కలిగి ఉండికూడా పేదరికంతో బాధపడే వాడు క్రితం జన్మలో దానధర్మములు చేయాలి అని తెలిసి కూడా దానధర్మములు చేయని వాడే. ఈ జన్మలో తెలివితేటలు లేకపోయినా కూడా అధికంగా ధనము సంపాదించిన వాడు. కిందటి జన్మలో తెలివి తక్కువ వాడైనా పేదసాదలకు దానధర్మములు చేసిన వాడై ఉంటాడు. ఈ జన్మలో విద్యావంతుడు మేధావి అయిన వాడు పూర్వజన్మలో గురువులను సేవించి విద్యావంతుడై తాను నేర్చుకున్న విద్యను ఇతరులకు నేర్పించిన వాడై ఉంటాడు. 
కొంతమందికి విద్య నేర్చుకోవాలని అనుకున్నా విద్య రాదు. అటువంటి వాడు పూర్వజన్మలో విద్యావంతులై గర్వించి సాటి విద్యావంతులను అవమానించి ఉంటారు. 


ఈ జన్మలో ఏరకమైన బాధలు లేకుండా రోగాలు లేకుండా భార్యా బిడ్డలతో సుఖంగా జీవిస్తున్న వారు పూర్వ జన్మలో సత్యము పలుకుచూ ఇతరుల మీదదయ చూపుతూ దానధర్మములు చేసినవారు.ఈ జన్మలో మాటవినని భార్య, మూర్ఖులైన కుమారులు, ఒంటి రోగముతో నిండా బాధపడే వారు కిందటి జన్మలో కోపంతోనూ, దురాశతోనూ, నాస్థికత్వముతో విర్రవీగిన వారు. ఈ జన్మలో పుట్టుగుడ్డి వాడు లేక మధ్యలో చూపుపోయిన వాడు పూర్వజన్మలో అందగాడై ఉండి ఇతరుల భార్యల వంక చెడుభావనతో చూసిన వాడు. ఈ జన్మలో చెవిపోటుతో బాధపడే వాడు పోయిన జన్మలో మంచి వారిని పరుషమైన మాటలతో బాధపెట్టినవాడై ఉంటాడు. ఉదరవ్యాధులతో బాధపడేవాడు పోయినజన్మలో ఇతరులకు విషం పెట్టినవాడు. మూత్రకోశ వ్యాధులతో బాధపడే వాడు పోయిన జన్మలో కన్యలను, పర కాంతలను శీలము కాజేసిన వాడు. 
ఈ జన్మలో క్షయరోగముతో బాధపడుతున్న వాడు పోయిన జన్మలో పరుల ఆహారమును అపహరించిన వాడై ఉంటాడు. 


ఈ జన్మలో కుష్టురోగముతో బాధపడే వాడు పూర్వ జన్మలో పరులను దారుణంగా హింసించిన వాడై ఉంటాడు. ఈ జన్మలో కుంటివాడుగా ఉన్నవాడు పోయిన జన్మలో పరుల కాళ్ళుచేతులు విరిచిన వారై ఉంటారు. ఈ జన్మలో చర్మరోగంతో బాధపడే వారు పోయిన జన్మలో మంచి వారిని హింసించిన వారు. ఈ జన్మలో పాదములకు రోగములు వచ్చిన వారు పోయినజన్మలో పాదములు కడగకుండా దేవుని వద్దకు వెళ్ళిన వారే. ఇంకా పేద వారిని, అమాయకులను నిష్కారణంగా పాదములతో తన్నినవారే. ఈ జన్మలో కడుపులో రోగములతోను, జ్వరముతోనూ, శరీరం అంతా రోగములతో బాధపడేవారు పోయినజన్మలో జంతువులను చంపినవారు గురువులను బాధపెట్టినవారు. ఈ జన్మలో గూనివాడు, మరగుజ్జువాడు పోయిన జన్మలో ధాన్యంలో తాలుగింజలు కలిపి అమ్మినవాడు, తప్పుడు కొలతలతో ప్రజలను
బాధపెట్టినవాడు. 


ఈ జన్మలో వెర్రివాడు పిచ్చివాడు పోయిన జన్మలో అమాయకులను మోసగించి ధనం సంపాదించినవారు. ఈ జన్మలో సంతానము లేనివారు పోయిన జన్మలో తల్లితండ్రులకు శ్రాద్ధం పెట్టనివారు, పసిపిల్లలను చంపినవారు. ఈ జన్మలో నపుంసకులు పోయినజన్మలో ఎద్దులకు వృషణాలు కొట్టినవారు. ఈ జన్మలో వైధవ్యము పొందిన వనిత పోయిన జన్మలో భర్తనుమోసగించి ధనము సంపాదించినది, తనభర్తను వదిలి మరియొకరి భర్తనుకోరింది. ఈ జన్మలో గొప్పవంశంలో పుట్టి కూడా చేయకూడని పనులు అందరూ ఏవగించుకునే పనులు చేసిన వారు పూర్వజన్మలో అహంకారంతో, గర్వంతో, మదంతో ఇతరులను అవమానించిన వారు. ఈ జన్మలో సేవకులుగా సేవకావృత్తి చేస్తూ యజమానులు పెట్టే బాధలను భరిస్తున్న వారు పూర్వజన్మలో అమాయకులను నిరపరాధులను కొడుతూ తిడుతూ హింసించినవారే. 
ఈ జన్మలో చెయ్యని నేరానికి శిక్ష అనుభవించేవారు. పూర్వజన్మలో నిరపరాధిని శిక్షించినవాడే. 



ఈ జన్మలో ఒక్కసారిగా బంధుమిత్రులను పోగొట్టుకున్నవాడు. పూర్వజన్మలో నిర్దాక్షిణ్యంగా ఎందరినో చంపినవాడు. ఈ జన్మలో తనకున్న ధనమును పోగొట్టుకున్న వాడు పూర్వజన్మలో తనదగ్గర దాచిన ఇతరుల ధనమును వారిని మోసము చేసి అపహరించిన వాడు. పార్వతీ నేను పైన చెప్పిన పాపములు చేసిన వారందరూ ముందు నరకము అనుభవించి తరువాత మానవులుగా పుట్టి ఆ కర్మ ఫలము అనుభవిస్తున్న వారే. అధిక పాపములు చేసినవారు మొదట నరకంలో సూక్ష్మ శరీరంతో అనేక బాధలు అనుభవించి, తదుపరి కొన్ని కోట్ల జంతు జన్మలు పొంది చాలా వరకూ తమ పాపాలను తొలగింపజేసుకుని చివరకుమానవ జన్మ పొందుతారు.ఏ జన్మలో చేసిన పాపాలు ఆ జన్మలో అనుభవానికి రావు " అని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: