మండల పూజల నిమిత్తం కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయ ద్వారాలు తెరుచుకున్న తొలి రోజు నుంచే వివాదాలు చెలరేగిన సంగతి తెలిసందే. భారీ బందోబస్తు మధ్య ఆలయ ద్వారాలను ఆలయ ప్రధాన పూజారి కందరారు మహేశ్ మోహనర్, మేల్ తంత్రి సుధీర్ నంబూద్రి ఈ నెల 16న తెరిచారు.
అయితే గత సంవత్సరం పరమ పవిత్రంగా భావించే ఈ ఆలయంలోకి మహిళా భక్తుల రాకను అయ్యప్ప భక్తులు తీవ్రంగా వ్యతిరేకించారు దీంతో గత సంవత్సరం ఇది పెద్ద వివాదంగా మారి ఘర్షణకు దారితీసింది. దీంతో కేరళ ప్రభుత్వం ఈసారి అప్రమత్తమై శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చే మహిళలకు రక్షణ కల్పించలేమని ప్రభుత్వం ముందే తేల్చి చెప్పేసింది.
అయినప్పటికీ వినకుండా బిందు అమ్మాని అనే మహిళ శబరిమలలోకి వెళ్లే ప్రయత్నం చెయ్యడంతో ఆమెపై ఆందోళన కారులు కారంపొడితో దాడి చేశారు. ఎర్నాకుళం సిటీ పోలీస్ కమీషనర్ ఆఫీసు ముందు ఈరోజు ఉదయం ఈ ఘటన జరిగింది. సామాజిక కార్యకర్త తృప్తీ దేశాయ్తో బిందు శబరిమల వెళ్లే ప్రయత్నం చేశారు.
అయితే భద్రత కల్పించాలని వారు పోలీసు కమీషనర్ ఆఫీసుకు రాగ ఆ సమయంలో బిందుపై కొందరు కారంపొడి, పెప్పర్తో దాడి చేశారు. ఇవాళ రాజ్యాంగ దినోత్సవం అని, ఈ సందర్భంగా వారు శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకుంటామని మహిళా హక్కుల కార్యకర్త తృప్తీ దేశాయ్ మీడియాకు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ తమను అడ్డుకోలేరన్నారు. తమకు సెక్యూర్టీ ఇచ్చినా, ఇవ్వకపోయినా తాము మాత్రం ఆలయానికి వెళ్తామని ఆమె అన్నారు. కాగా ఈ సంవత్సరం జనవరి 2వ తేదీన శబరిమలలో అయ్యప్పస్వామిని బిందు దర్శనం చేసుకున్నారు. కాగా బిందు కేరళలోని కన్నూరు వర్సిటీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు.