కార్తీక మాసం నుంచి మొదలైన అయ్యప్ప శరణు ఘోషలు దేశమంతా మారు మ్రోగుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల లో అయితే అయ్యప్ప మాలలు వేసే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఇక మకర సంక్రాతి దగ్గరపడుతున్న కొద్ది శబరిమలై దర్శించే వారి సంఖ్య కూడా అత్యధికంగా పెరుగుతుంది. అయితే శబరిమలలో స్వామి సన్నిధిలోని 18 మెట్లు అత్యధికంగా పేరుగాంచాయి. అయితే ఈ పవిత్రమైన మెట్లను పదెనెట్టాంబడి అని అంటారు. 


పదునెట్టాండి అనగా (18 మెట్లు) స్వామి వారి సన్నిధానంలో ఉండే 18 మెట్లను పరుశురాముడు నిర్మించాడని చెప్పుకుంటారు. అష్టదిక్పాలకులు ఎనిమిది మంది (ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు), రెండు యోగములు (కర్మయోగం, జ్ఞానయోగం), విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానానికి రూపాలుగా ఈ పద్దెనిమిది మెట్లను ఏర్పరచారు. సన్నిధానంలో చేరిన భక్తులు 18 మెట్లను ఎక్కేముందు కొబ్బరి కాయను కొట్టి, నెయ్యితో స్వామివారికి అభిషేకం చేస్తారు. 


ఆ తరువాత మాలిగై పుత్రమ్మ వారి సన్నిధికి చేరుకుని ఆమె చుట్టూ కొబ్బరి కాయలు దొర్లించి పసుపు, జాకెట్ ముక్కలను ఆమెకు మొక్కుబడిగా చెల్లించుకుంటారు. ప్రతి ఏటా నవంబర్ మధ్య నుంచి జనవరి వరకు శబరిమలై భక్తకోటితో పులకించిపోతోంది. రెండున్నర మాసాల పాటు దక్షిణ భారతం శరణుఘోషతో మారు మ్రోగిపోతుంటోంది. ప్రతిరోజు సుమారు ఐదారులక్షల మంది అయ్యప్ప భక్తులు పంపానది తీరం నుండి ఐదు కిలోమీటర్ల దూరం ఎత్తైన కొండ ప్రాంతంలో ప్రయాణం చేసి సన్నిధానం చేరుకుంటారు. 


అయ్యప్ప ఆలయానికి చేరుకోవాలంటే, పంపానది నుంచి సుమారు, 4,135 అడుగుల ఎత్తులో ఉన్న సన్నిధానంకు చేరాల్సిందే. ఈ మార్గమే మనోదౌర్భాల్యాలనీ , శారీరక సౌఖ్యాలనీ మండించి బూడిద చేయగల దైవమార్గం. ఈ మార్గంలో ఎదురయ్యే కష్టాలే ఆ హరిహరసుతుడు పెట్టే పరీక్షలు. వీటిలో నెగ్గితే మోక్షమార్గం కళ్లెదుట కనబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: