పుణ్యక్షేత్రాల్లో అతి పెద్ద పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. టిటిడికి సంబంధించిన ఆర్ధిక లావాదేవీలన్నీ యస్బ్యాంక్ లో ఉన్న విషయం తెలిసిందే. టిటిడి దగ్గర ఉన్న సంక్షోభం వల్ల చిక్కుకుపోయిన యస్ బ్యాంక్ నుంచి టిటిడికి చెందిన కొంత డబ్బులు... రూ.1300 కోట్ల డిపాజిట్లను కొద్ది నెలల క్రితమే ఉపసంహరించుకున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. యస్ బ్యాంక్ బోర్డును రద్దు చేస్తూ.. ఇక ఎంత అవసరమున్నా సరే నెలకు రూ.50,000 మించి నగదు ఉపసంహరణకు అవకాశం లేకుండా ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో టిటిడి తన డిపాజిట్లను వెనక్కి తీసేసుకుని పెద్ద గండం నుంచి బయటపడిందని సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
అయితే అసలు ఈ యస్ బ్యాంక్ వంటి బ్యాంకుల్లో టిడిపి డిపాజిట్లు ఇంత కాలం ఎందుకు కొనసాగించారు అంటూ కొన్ని వివాదాలు కూడా వినపిస్తున్నాయి. ఇక ఈ ఘటన ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. టిటిడి అకౌంట్స్ విభాగం అతి పెద్దది. ఫైనాన్స్ రంగంలో అనుభవం ఉన్న చాలా మంది పెద్దలే ఇందులో ఉన్నారు. బాలాజీ ఎఫ్ అండ్ సిఇఓగా ఉన్నారు. మరి అలాంటి వాళ్లంతా ఇలా ప్రయివేటు బ్యాంకుల్లో డిపాజిట్లకు ఎందుకు మొగ్గుచూపారన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. దీని వెనుక ఏమైన మతలబ్ ఉందా అంటూ ప్రశ్నల్లు వెల్లువెత్తుతున్నాయి. ఏదైనా ప్రయివేటు బ్యాంకుల్లో టిటిడి సొమ్మును డిపాజిట్ చేసేప్పుడు ఆ బ్యాంకుల స్థితి గతులు, ఆ సమయంలో బ్యాంకుల పరిస్థితిపై అధ్యయనం చేయకుండానే ఇలాంటివి చేస్తున్నారా? అంత అజాగ్రత్త వహించడానికి కారణాలు ఏమిటి?
యస్ బ్యాంక్ ఉదంతం వెలుగు చూసింది.. కాబట్టి ఇది బైట పడింది. మరి అంతకు ముందే డిపాజిట్లు వెనక్కి తీశారు కాబట్టి సరిపోయింది. లేదంటే రూ. 1300 కోట్లు మునిగిపోయేవి కదా? మరి స్వామివారి ఆలయం కోసం కేటాయించిన నగదును ఎంతో భద్రంగా ఉంచాల్సిన అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమా అంటున్నారు. అసలు ప్రైవేటు బ్యాంకుల్లో టిటిడి డిపాజిట్లపై మొదటి నుంచి ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. ఈ డిపాజిట్ల వెనుక భారీగా ముడుపులు చేతులు మారుతున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. మరి ఇప్పటికైనా టిటిడికి చెందిన రూ.12 వేల కోట్ల డిపాజిట్ల పరిస్థితిని సమీక్షించి, వాటిపై విచారణ చేయిస్తే బాగుంటుందని డిమాండ్ కూడా వినిపిస్తోంది. మరి ఇప్పటికైనా టిటిడి ఇతర ప్రయివేటు బ్యాంకుల పరిస్థితి కూడా చూసి స్వామి వారి ధనాన్ని భద్రతపై ఓ క్లారిటీ ఇస్తే భక్తులు సంతోషపడతారు. అంతేకాక ఇక పై ఆయన డబ్బు ప్రైవేట్ బ్యాంకులను నమ్మి అక్కడ డిపాజిట్ చేయడమనేది సరికాదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.