మన తెలుగు యేడాది ప్రారంభ రోజుగా ఉగాదిని పిలుస్తారు. ఉగాదికి మన తెలుగు వాళ్ల సంస్కృతితో మిళితమైన కొన్ని వేల ఏళ్ల చరిత్ర ఉన్నట్టు చారిత్రక ఆధారాలు చెపుతున్నాయి. ఇక మావి చిగురు తొడిగిన దగ్గర నుండి వసంత రుతువు గా చెప్పబడుతుంది. మనకున్న అన్ని మాసాల్లో ప్రతి మాసానికి ఏదో ఒక స్పెషాలిటీ ఉంటూనే ఉంది. వసంత రుతువు శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైన రుతువుగా చెపుతారు. సంవత్సరం ప్రారంభంలో మొదటి మాసం చైత్రం, మొదటి నక్షత్రం అశ్విని, మొదటి తిథి పాడ్యమి, మొదటి ఘడియ లో బ్రహ్మ సృష్టిని నిర్మించినందున అప్పుడే ఉగాది అని చెపుతుంటారు.
ఇక ఉగాది రోజున అందరూ ఉదయం తలస్నానం చేస్తారు. అనంతరం కొత్త బట్టలు వేసుకుని ఉగాది పచ్చడి చేసుకుని.. తాము ప్రసాదంగా చేసుకుని.. అందరికి పంచుతారు. ఇక పంచాగం వింటారు. ఇదిలా ఉంటే ఉగాది పండగ రోజు మన పర్వీకులు పాటించే ఆచారా సంప్రదాయాలు కూడా పాటించాల్సిన బాధ్యత మనపై ఉంది. అవి నేటి ఆధునిక ప్రపంచంలో మరుగున పడిపోతున్నాయి. వీటిల్లో ధ్వజారోహణం ఒకటి. అంటే దవనంతో దేవుడిని ఆరాధించటం, ధ్వజారోహణం, చత్ర చామర వితరణ, ప్రసాదాన ప్రారంభం మొదలైనవి.
ఉగాది రోజు ఇంటి ముందు ఒక వెదురు కర్ర పాతి దానికి పసుపు రాసి కుంకుమతో అలంకరించాలి. దాని పై రాగి చెంబు పెట్టి పూవులతో పూజిస్తే చాలా మంచిది అని మన పెద్దలు చెప్పేవారు. ఇక ఉగాది నుంచే వాతావరణంలో వేడి పెరుగుతుంది.. అంటే మనం వేసవి కాలంలోకి ఎంటర్ అవుతాం. అందుకే ఈ టైంలో పేదలకు విసన కర్రలు పంచాలని అంటుంటారు. అలాగే ఉగాది వచ్చిందంటే మన పూర్వీకులు ఇంటి ముందు తాటాకులతో పందిళ్లు వేసుకుంటారు. అవి చల్లగా ఉంటాయి.. పందిళ్లు వేసి అక్కడకు వచ్చే వారికి మంచినీళ్లు, మజ్జిగ ఇవ్వడం ఆనవాయితీగా వచ్చేది. ఇలా చేయడం వల్ల మనకి పుణ్యం , దానం వల్ల పురుషార్థం దక్కుతాయి.