దేశవ్యాప్తంగా శివ భక్తులు ఎందరు ఉన్నారో ఇప్పుడు ప్రత్యేకంగా లెక్కలు అక్కర్లేదు. ఈయన త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు. శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు. శివుడు పశుపతిగాను, లింగం రూపములోను సింధు నాగరికత కాలానికే పూజలందుకున్నాడు. నేటికీ దేశమంతటా ఎన్నో శివాలయాలు ఉన్నాయి.
ఇక మహా శివరాత్రి పర్వదినాన ప్రతి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే శివాలయంలో మాత్రం కనీవిని ఎరుగని వింత చోటుచేసుకుంటుంది. సాధారణంగా తమ కోరికలు తీరితే భక్తులు దేవుడికి మొక్కులు చెల్లించుకోవడం పరిపాటి. తలనీలాలు, నగదు, నగలు ఇంకా ఇతర రూపేణా మొక్కులు చెల్లిస్తుంటారు. అయితే ఓ శివాలయంలో భక్తులు సిగరెట్లతో మొక్కులు చెల్లించుకుంటారు. వినడానికి విచిత్రంగా ఉన్నా... ఇది నిజం.
హిమాచల్ ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఓ శివాలయంలో ఈ వింత ఆచారం ఏళ్లుగా అమలులో ఉంటోంది. ఇది సుప్రసిద్ధ శైవక్షేత్రంగా కూడా పేరుగాంచింది. ఈ శివాలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని లూట్రా మహాదేవ్ ఆలయంలో కొలువైన శివ లింగానికి ఇతర ఆలయాల్లోలాగా అగరుబత్తులను వెలిగించకుండా, సిగరెట్లతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారికి సిగరెట్లు మొక్కుగా చెల్లిస్తారు. ఇక్కడి శివలింగంపై సిగరెట్ ను ఉంచితే దానికదే వెలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇక సిగరెట్ వెలిగాక అచ్చం మనం పొగ పీల్చినట్టుగానే సిగరెట్ నుంచి పొగ వస్తుంది. శంకరుడికి ఇలా సిగరెట్లను సమర్పించడం వల్ల భక్తుల కోరిన కోరికలు నెరవేరుతాయని వారు నమ్ముతారు.