ప్రతి సంవత్సరం విజయదశమి సమయంలో బెజవాడలో శ్రీ కనకదుర్గమ్మ వారి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా, అట్టహాసంగా ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి నిర్వహిస్తుంటారు. ఈ సంవత్సరం మాత్రం కరోనా వైరస్ ప్రభావిత పరిస్థితుల కారణంగా సాధారణ స్థాయిలో మాత్రమే జరుగుతాయని ఊహించారు అందరూ కానీ గత ఉత్సవాలకు ఏమాత్రం తగ్గకుండా విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మలగన్నమ్మ దుర్గా దేవి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. కరోనా కష్టకాలంలోనూ కూడా అశేష సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని భారీగా కానుకలు సమర్పించారు. ఈ మేరకు దుర్గమ్మ ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో ఎంవీ సురేష్‌బాబు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. దసరా సందర్భంగా ఈ ఏడాది 2,36,182 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు వెల్లడించారు. మొత్తం 85,058 మంది భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు తీసుకున్నారని, వారిలో దాదాపు 35 వేల మంది భక్తులు దర్శనానికి రాలేకపోయినట్లు గుర్తించినట్లు వారు తెలిపారు. ఆన్‌లైన్‌తో పాటు దూర మరియు దగ్గర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి వచ్చిన వారికి 1,51,124 టికెట్లు అందజేసినట్లు పేర్కొన్నారు. నవరాత్రుల సందర్భంగా టికెట్లు, లడ్డూ ప్రసాదాలు, పరోక్ష కుంకుమార్చనలు, చీరల వేలం, ఇతర మార్గాల ద్వారా ఆలయానికి రూ.4.36 కోట్ల వరకు ఆదాయం సమకూరినట్లు వివరించారు.

కోవిడ్ 19 లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాలను ఈ సంవత్సరం నిర్వహించామని.. కరోనా కారణంగా ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సాధారణ భక్తులు, భవానీ దీక్షాపరులు చాలా చక్కగా సహకరించారని వారు ఆనందం వ్యక్తం చేశారు. అమ్మవారి భక్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో ఉత్సవాలను సజావుగా నిర్వహించినట్లు వివరించారు. మూలా నక్షత్రం రోజున కొండ చరియలు విరిగిపడిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి స్వయంగా పరిశీలించి.. దేవాలయ అభివృద్ధికి రూ. 70 కోట్ల నిధులు మంజూరు చేశారని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: