ధర్మ శాస్త్రాల ప్రకారం పొద్దున్నే లేచేసమయంలో భూమిపై తొలి అడుగు వేయకముందే ధరణికి ప్రణామం చేయాలి. ఇలా చేయడం వల్ల భూమాత నుంచి ప్రత్యక్షంగా ఆశీర్వాదాలు పొందుతామని విశ్వసిస్తుంటారు. ఫలితంగా దైనందిన జీవితంలో సంతోషంతో పాటు సంపద కూడా పెరుగుతాయని ఎంతో మంది నమ్ముతారు. అందుకే ఉదయాన్నే లేవగానే భూమిని ప్రణామం చేయడం మరువకూడదు. అంతేకాకుండా ఆ రోజు ఎలాంటి అశుభాలు జరగవని నమ్ముతారు. ఉదయాన్నే లేవగానే చాలా మంది చేసే మొదటి పని అద్దంలో ముఖాన్ని చూసుకోవడం. ఇప్పుడైతే లేవకముందే మొబైల్ ఫోన్ ను చూడటం ఎక్కువ మంది చేస్తున్నారు. అయితే ఈ అలవాటుకు ఎంత దూరముంటే అంత మంచిది. ఎందుకంటే ఇలా చేసినప్పుడు ప్రతికూల శక్తి మనల్ని తన నియంత్రణలో పెట్టుకుంటుంది. ఇందుకు బదులు ఉదయాన్నే లేచి ముఖాన్ని పరిశుభ్రంగా కడుక్కొని ఇంట్లో ఉన్న భగవంతుడి రూపాన్ని సందర్శించాలి. అనంతరం మీ పనులు మీరు చేసుకోవచ్చు.
ఆవును సేవించడం అన్ని విధాల మంచిదని ధర్మశాస్త్రాల్లో వేద పండితులు ఎప్పుడో చెప్పారు. ఆవును సేవిస్తే శ్రీ మహాలక్ష్మీని కొలిచినట్లేనని ఎంతో మంది విశ్వసిస్తుంటారు. అందుకే ఉదయాన్నే లేచిన వెంటనే మీరు తీసుకునే ఆహారంలో కొంత భాగాన్ని ఆవుకు తినిపిస్తే ఎంతో మేలు జరుగుతుంది. ఆవు పేడతో కల్లాపి చల్లితే ఇంట్లో దేవతలు వస్తారని ప్రతీతి. ఫలితంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుతారు. అనంతరం ఓ పాత్రలో కొంత ఆహారాన్ని కాకులు లేదా పక్షులకు పెట్టాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని విశ్విసిస్తారు. అంతేకాకుండా ఎలాంటి శత్రుభయాలు ఉండవు.