అరిషడ్వర్గాలు ఎవరైతే పొంది ఉంటారో వారి మనసెప్పుడు స్వార్ధం, సంకుచిత భావాలే కాకుండా కల్మష, వికారాలతో నిండి ఉంటుంది. ఇవే దుఃఖానికి మూల హేతువులు. భారతీయ ధర్మశాస్త్రం ప్రకారం మానవుడు మోక్ష సాధన క్రమంలో తనలో పేరుకొని ఉన్న ఈ ఆరు అంతర్గత శత్రువులను జయించాలని ధర్మశాస్త్రతోత్తములు పదేపదే చెపుతారు
ఆవే:
• కామం (మితిమీరిన కోరిక ఏదైనా సరే)
• క్రోధం (కోపం)
• లోభం (పిసినారితనం లేదా స్వార్ధం)
• మోహం(ఆకర్షణ వలన కలిగే తాత్కాలిక వలపు)
• మదం (అహంకారం)
• మాత్సర్యం(ఈర్ష్య, అసూయ, మత్సరము, పగ,)
1. కామము – ఇది కావాలి అది కావాలి అని తాపత్రయ పడటం, అవసరాలకు మించిన వికారపు కోరికలు కలిగి ఉండటం. నరకాసురుడు, జరాసంధుడు, కీచకుడు అనేక స్త్రీలను, చెఱపట్టి అనుభవించిన తరవాత సంపూర్ణంగా నశించిపోయారు.
ఆద్ధునిక కాలంలో కామంతో వివాహేతర సంబందాల వలన జరిగే నేరాలు, నేరస్తులలో అంతర్గతంగా దాగున్న అరిషడ్వర్గాల కిందకే వస్తాయి. ప్రతిరోజూ వార్తా పత్రికలలో ఎన్నో ఉదాహరణలు దొరుకుతాయి.
2. క్రోధము – కోరిన కోరికలు నెరవేరక పోతే చింతించుతూ, ఆ అసహజ కోరికలు నెరవేరనందుకు వేరెవరో కారణమంటూ ఇతరులపై ప్రతీకారము తీర్చుకోవాలని ఉద్రేకముతో పగబూనటం వారిపై కక్ష కట్టటం లాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవటం.
శిశుపాలుడు తను వివాహమాడదలచిన రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు వివాహమాడెనని శ్రీకృష్ణునిపై కోపం పెంచుకొని తీవ్రమైన పలు నేరాలకు పాల్పడినందుకు గాను అదే భగవానుని సుదర్శన చక్రంతో శిరచ్చేధనం పొందాడు.
ఆధునిక కాలంలోని అక్రమ, అవినీతి, కీచక ప్రవృత్తితో నేరాలు చేసే వారంతా ప్రశ్నించిన లేదా ఎదిరించిన వారిపై తమ కోపం ప్రదర్శించి చెసే ధారుణ కృత్యాల ఫలితంగా వారూ నశించి పోతున్నారు.
3. లోభము – కోరికతో తాను ఆశించినది, సంపాదించుకున్నది, పొందినది సర్వం తన ఆధీనంలో ఉండాలని, తను, తన కుటుంబం, తన బంధువర్గం, తన మిత్రులు మాత్రమే అనుభవించాలని పూచిక పుల్ల కూడా అందులో నుండి ఇతరులకు చెందగూడదనేదే లొభ గుణం.
దాన ధర్మ పరోపకారం చేయకపోగా ఇతరుల ధనసంపద, భూసంపదు అన్యాయంగా దోచేయటం, కబ్జా చేయటంతో పాటు పరస్త్రీవ్యామోహంతో తాను ఆశించిన వారిని నయాన్నో భయాన్నో లోబరచుకొనే దుష్కార్యములు చేయటం.
దుర్యోధనుడు, రావణుడు, జరాసంధుడు, శిశుపాలుడు, కీచకుడు మొదలైన వారు లోభగుణము వలన నశించారు.
ఆధునిక కాలంలోని భూకబ్జాదారులు, స్త్రీల మాన ధన ప్రాణాలను హరించేవారు, అమాయకులను అసమర్ధులను నిలువు దోపిడీ చేసే వారంతా ఈ ఖాతాలోకే వస్తారు. తన కుటుంబ సభ్యులకే సమాజంలోని మేలైన సంపద సర్వ అధికారాలు దక్కాలని కోరుకొని దుశ్చర్యలకు పాలుపడే రాజకీయ నాయకులు కోకొల్లలుగా ఉదాహరణలు
4. మోహము – తాను కోరినది కచ్చితముగా తనకే కావాలని, ఇతరులు పొందకూడదని అతి వ్యామోహము కలిగి యుండడము, తాను కోరినది ఇతరులు పొందితే భరించలేకపోవడము.
దశరథుడు కైక మీది వ్యామోహము చేత జ్ఞానం కోల్పోయి ఫలితంగా రాముణ్ణి అడవులకు పంపి నశించటం.
ఆధునిక కాలంలోని ముఖ్యంగా తమకు ప్రియమైనవారి చెప్పుడుమాటలు వినేవారు ఈ వర్గంలోకి వస్త్తారు.
5. మదము – తాను కోరిన కోరికలన్ని తీరిన తరవాత ఆ గెలుపంతా తన గొప్పతనమేనని గర్విస్తూ మరెవ్వరికి ఈ బలము లేదని ఇతరులను లెక్కచేయక పోవడము.
కార్తవీర్యార్జునుడు ఆయన పుత్రులు నూర్వురు మదము వలననే నశించారు.
6. మాత్సర్యము – తాను కున్న సిరి సంపదలు ఇతరులకు ఉండగూడదని “తనకు దక్కనిది ఇతరులకు దక్కకూడదనే” విపరీత వాంచ - ఒకవేళ తను పొందలేనిది ఇతరులకు కూడా దక్కకూడదనే “ఈర్ష్య” కలిగి యుండటం.
సుయోధనుడు రాజసూయాగంతో ధర్మరాజు పోందిన అధికార ఐశ్వర్యాలు చూసి వారికవి దక్కకూడదని మాత్సర్యంతో వ్యూహం పన్ని జూదం ఆడేలా చేసి వారి రాజ్యాన్ని వారి సంపదలను హరించటం.
ఈ అరిషడ్వర్గాలు మనసులో చేరి మంచితనాన్ని, మానవత్వాన్ని, పరువు ప్రతిష్టలను, గౌరవాన్ని మరచేలా చేసి మనిషిని దొంగతనం, హత్యలు, మానభంగాలు, కౄరత్వం సంతరింప చేసుకొని చెడు కర్మలకు పాల్పడటానికి కారకులగుచున్నారు. అరిషడ్వర్గాలే మనసులో చేరి అంతరంగంలో తిష్టవేసి విచక్షణా జ్ఞానాన్ని దొంగిలించే దొంగల లాంటివి వీటి నుండి జాగ్రత్త వహించితే “ముక్తి” కి మార్గము సులభతరమవుతుంది.
అరిషడ్వర్గాలలో అత్యంత ప్రమాధకరమైనది కామమే. ఎందుకంటే కామం వెనుక ఉండే వన్నీ దాని ఉత్పాధనలే. కాబట్టి అరిషడ్వర్గాలలో మొదట దీన్నే ప్రస్తావించారు. ఇదే విషయాని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ప్రస్తావించారు.
విషయ వాంఛలు గురించి సదా మననం చేయు వానికి, దాని పైనే ధ్యాస పెరిగి కామంగా మారి చివరకు క్రోధమవుతుందట. క్రోధం వల్ల అవివేకం, దాని వలన జ్ఞాపకశక్తి నశించి తత్ఫలితంగా మనిషి తన బుద్ధి, విచక్షణ కోల్పోయి తుదకు అధోగతి పాలవుతాడని గీతాభోదలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి చెప్పాడు.
వీటిని ఎలా అదుపులో ఉంచగలము అంటే ముఖ్యమైన ఆయుధం భగవంతునిపై నిజమైన నిత్యమైన సత్యమైన దివ్యమైన ప్రేమజ్ఞానం పెంపొందించుకుంటే చాలు. ఆ దేవదేవుని గురించిన జ్ఞానం ఎపుడు పొందుతామో (తెలుసు కుంటామో), అప్పుడు అరిషడ్వర్గాలు సమస్తము మన మనసు నుండి తొలగిపోతాయి నశించిపోతాయి.
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమ
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్దినాశాత్ప్రణశ్యతి
కోపం వల్ల అవివేకం, అవివేకం వల్ల మతిమరుపు, మతిమరుపుతో బుద్ధి నాశనం, బుద్ధి నాశనంతో మనిషే సర్వం నాశనం. ఇక్కడ అవసరం ఏమంటే, "కోపాన్ని క్రమబద్ధీకరించటం" - యాంగర్ మేనేజ్మెంట్ లాంటిది. వ్యాపార వణిక్ ప్రముఖులకు (ఆంట్రప్రెన్యూర్లకు) రాజకీయ నాయకులకు తప్పక ఉండాల్సిన లక్షణం. అత్యంత విలువైన వ్యాపార రాజకీయ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. లేకుంటే చెప్పుడు మాటలు విని, వాస్తవాలతో పనిలేకుండా ఆలోచించి తప్పుడు నిర్ణయాలతో బుర్రపాడు చేసుకుంటారు.
మనసులొఒకరకమైన అనిశ్చితి (కన్ఫ్యూజన్) నెలకొంటుంది. దాంతో సహజంగానే మతి మరుపు వస్తుంది. ఫలితంగా లక్ష్యం నుంచి తప్పు కుంటాం. అందరి ముందు నవ్వుల పాలవుతాం. అందుకే కోపాన్ని జయించాలి. “క్షణిక కోపాన్ని అంటే టెంపర్” ని అదుపులో ఉంచుకోవాలి, లేదా నియంత్రించుకోవటానికి కొన్ని క్షణాలు మౌనం వహిస్తే అది సర్ధుకుంటుంది అప్పుడు వివేకం మేల్కొంటుంది. ఎట్టి పరిస్థితుల్లో సహనం కోల్పోవద్దు. అలా కామం ఒక్కదాన్ని అదుపులో పెట్టుకుంటే అనియంత్రితంగా ఇతర అరిషడ్వర్గాలు అదుపులోకి వస్తాయి.