దసరా బన్నీ జైత్రయాత్రలో దాదాపుగా 50 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లాలోని ప్రసిద్ధి చెందిన మాళ మల్లేశ్వర్ స్వామి వద్ద ఉత్కంఠభరితంగా కర్రల సమరం జరిగింది. పటిష్టమైన పోలీస్ బందోస్తులో సాగిన ఏ సమరంలో రక్తం చిందింది. హోళగుంద మండలం దేవరగట్టులో ఏటా విజయ దశమి రోజున జరిగే కర్రల సమరం (బన్నీ ఉత్సవం)లో 50మందికి పైగా గాయాలపాలవగా, నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


ప్రతి ఏడాది మాదిరిగానే తమ ఇలవేల్పును దక్కించుకునేందుకు అయిదు గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా ఏర్పడి కర్రలతో తలపడ్డారు. ఇందులో ఇరువర్గాలవారు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే ఆచారాన్ని ప్రజలు ఈ సారి కొనసాగించారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫకీరప్పలు దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షించారు. బన్నీ ఉత్సవంలో ఈ ఏడాది హింసను నివారించేందుకు పోలీసులు చేపట్టిన చర్యలు ఏ మాత్రం ఫలించలేదు. 



సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, ఫాల్కన్‌ వాహనంతో నిఘాను పటిష్టం చేశారు. 1000 మందికి పైగా పోలీసులతో బందోబస్తు చేపట్టారు. నెల రోజుల ముందు నుంచే అవగాహన కార్యక్రమాలు, ఫ్లెక్సీలు, లఘు చిత్రాలతో ప్రచారం నిర్వహించారు. మద్యాన్ని అరికట్టేందుకు  అబ్కారీ అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.ఉత్సవంలో పాల్గొన్న వారిలో అధికశాతం మంది మద్యం తాగి రావడంతో ఎక్కువ మంది గాయాలపాలయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: