ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల‌ను నిరాశ‌ప‌రుస్తూ....భార‌త క్రికెట్ టీం వ‌ర‌ల్డ్‌క‌ప్ నుంచి నిష్క్ర‌మించింది. ప్రపంచకప్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగిన టీమిండియా సెమీస్‌పోరులో చేతులెత్తేసింది. న్యూజిలాండ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్ 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. దీంతో కివీస్ 18 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. పోరాడి ఓడిన కోహ్లీసేన మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోసారి ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే చేజింగ్ చేయలేక చతికిలబడిన టీమిండియా తీరును చూసి...``న్యూజిలాండ్ గెలిచింది అనడంకంటే భారత్ ఓడింది  అనడమే కరెక్ట్`` అంటూ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 


వ‌ల‌ర్డ్‌క‌ప్ సెమిస్‌లో భాగంగా, మాంచెస్టర్‌లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జర‌గాల్సిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ నిన్న వ‌ర్షం కార‌ణంగా వాయిదా ప‌డ్డ‌ సంగ‌తి తెలిసిందే. ఏ దశలోనూ ఆటను కొనసాగించ‌డానికి వీలు లేని నేప‌థ్యంలో ఆట‌ను అంపైర్లు నేటికి వాయిదా వేశారు.నిన్న జ‌రిగిన మ్యాచ్‌లో వర్షం కురిసే సమయానికి న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 211 పరుగులు చేసింది. నేడు రిజ‌ర్వ్ డే కావ‌డంతో మిగ‌తా ఆట‌ని ఇక్క‌డ నుండి కొనసాగించారు. ఈ క్రమంలో కివీస్ మరో 3.5 ఓవర్లు ఆడింది. ఆ తరువాత భారత ఇన్నింగ్స్ సాగింది. 


రవీంద్ర జడేజా(77: 59 బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సర్లు), మహేంద్రసింగ్ ధోనీ(50: 72 బంతుల్లో ఫోర్, సిక్స్) అర్ధశతకాలతో రాణించడంతో భారత్ గెలుస్తుందని భావించారు. ఐతే ఆఖర్లో ధోనీ రనౌట్ కావడంతో భారత్ ఓటమి ఖాయమైంది. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ మూడు, బౌల్ట్, శాంట్నర్ రెండేసి వికెట్లు తీసి భారత్‌ను భారీ దెబ్బకొట్టారు. భారత్ బ్యాట్స్‌మెన్లలో కేఎల్ రాహుల్(1), రోహిత్ శర్మ(1), విరాట్ కోహ్లీ(1), దినేశ్ కార్తీక్(6) దారుణంగా విఫలమయ్యారు. వీరిలో ఏ ఒక్క బ్యాట్స్‌మన్ నిలబడినా భారత్‌కు విజయావకాశాలు మెరుగ్గా ఉండేవి. మిడిల్ ఆర్డర్‌లో రిషబ్ పంత్(32), హార్దిక్ పాండ్య(32) కొంతసేపు పోరాడ‌టంతో భార‌త్ రేసులో నిలిచింది. కానీ చివ‌రికి నిరాశే మిగిల్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: