బీసీసీఐ ఆహ్వానం మేరకు టీమిండియా కెప్టెన్ గా మాజీ క్రికెటర్ రవిశాస్ర్తి పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రధాన కోచ్గా రవిశాస్త్రి జట్టు కోసం ఎంతగానో పాటుపడ్డాడని మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ ప్రశంసించారు. కోచ్, ఇతర సిబ్బంది ఎంపిక బాధ్యతను క్రికెట్ పాలకుల కమిటీ (సీఓఏ) కపిల్ దేవ్ నేతృత్వంలోని సలహా కమిటీకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలో కపిల్తో పాటు అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామి సభ్యులుగా ఉన్నారు.
అయితే ప్రధాన కోచ్గా రవిశాస్త్రినే మళ్లీ నియామకం అయ్యే అవకాశాలు ఉన్నాయని అన్షుమన్ గైక్వాడ్ ఓ ఛానెల్కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నట్లు తెలిసింది. ‘జట్టు కోసం రవిశాస్త్రి చాలా కృషి చేశాడు. కోహ్లీసేన అందుకున్న వరుస విజయాలే అందుకు నిదర్శనం. నా దృష్టిలో అతనే మళ్లీ కోచ్గా నియామకం కావొచ్చు. మిగతా సిబ్బంది విషయానికొస్తే, దరఖాస్తు చేసుకున్న వారు బీసీసీఐ నిబంధనలకు అనుగుణంగా ఉన్నారో లేదో బట్టి తెలుస్తుంది.’ అని గైక్వాడ్ పేర్కొన్నారు. వచ్చే నెలలో కోచ్, మిగతా సిబ్బందికి ఈ కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. కాగా దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఈ నెల 30తో ముగియనుంది.
భారత జట్టును ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. రవిశాస్త్రి పర్యవేక్షణలో కోహ్లిసేన పలు ఐసీసీ టోర్నీలు ఓడిందని, తదుపరి ప్రపంకప్కు సిద్ధమయ్యేందుకు ఇదే సరైన సమయమని తెలిపాడు. ‘ప్రస్తుత కోచ్ పర్యవేక్షణలో భారత్ రెండు వరుస ప్రపంచకప్ల్లో సెమీస్లోనే నిష్క్రమించింది. టీ20 ప్రపంచకప్ల్లో కూడా సానుకూల ఫలితం రాలేదు. ఇప్పుడు 2023 ప్రపంచకప్కు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. జట్టులో మార్పులు కూడా అవసరమే. క్షిష్ట పరిస్థితుల్లో కోచ్ పాత్ర కీలకం. పరిస్థితులను ఆకలింపు చేసుకొని ఆటగాళ్లతో వ్యూహాలు రచించాల్సి ఉంటుంది. ఆటగాళ్లలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించాల్సి ఉంటుంది. అది ఆటను సాంకేతికంగా అర్థం చేసుకున్నప్పుడే సాధ్యమవుతోంది.’ అని రాబిన్ సింగ్ చెప్పుకొచ్చాడు.
భారత్ తరఫున 136 వన్డేలు, ఒక్క టెస్ట్కు ప్రాతినిథ్యం వహించిన రాబిన్ సింగ్కు కోచ్గా 15 ఏళ్ల అనుభవం ఉంది. 2007-09 మధ్య భారత జట్టు ఫీల్డింగ్ కోచ్గా కూడా పని చేసాడు. భారత అండర్-19, ఏ జట్లకు సైతం కోచ్గా సేవలందించాడు. ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టుకు సహాయ కోచ్గా కూడా బాధ్యతలు నిర్వర్తించాడు. ప్రస్తుతం భారత హెడ్ కోచ్ పదవి కోసం ఉవ్విళ్లూరుతున్నాడు.