ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో సగం మ్యాచ్‌లు ముగిసిన తర్వాత గానీ పుణెరి పల్టాన్ జట్టులో ఊపు రాలేదు. సొంతగడ్డ పుణెలో శనివారం రాత్రి గుజరాత్‌ పార్చూన్ జైయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన పుణెరి పల్టాన్ 43-33 తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. సీజన్‌లో 15వ మ్యాచ్ ఆడిన పుణెరి జట్టుకి ఇది ఐదో గెలుపుకాగా గుజరాత్‌కి తొమ్మిదో ఓటమి.


పుణెరి జట్టులో స్టార్ రైడర్ నితిన్ తోమర్ మరోసారి జట్టుని ముందుండి నడిపించాడు. మ్యాచ్‌లో 18 సార్లు రైడ్‌కి వెళ్లిన నితిన్ ఏకంగా 11 పాయింట్లని టీమ్‌కి అందించాడు. అతనికి డిఫెండర్ సుర్జీత్ నుంచి 5 పాయింట్లతో చక్కటి సహకారం లభించింది. ఇక సొంతగడ్డపై ప్రేక్షకుల నుంచి కూడా పుణె జట్టుకి ఊహించని సపోర్ట్ వచ్చింది.
గుజరాత్‌ జట్టుని ఒంటిచేత్తో గెలిపిస్తున్న సచిన్ ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. మొత్తంగా 20 సార్లు రైడ్‌కి వెళ్లిన సచిన్ 10 పాయింట్లతో సరిపెట్టగా డిఫెండర్ పర్వేశ్ మూడు పాయింట్లని మాత్రమే టీమ్‌కి అందించగలిగాడు. దీంతో గుజరాత్‌కి మరో ఓటమి తప్పలేదు.


ఇప్పటి వరకు జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో పాయింట్ల పట్టికని చుస్తే దబాంగ్ ఢిల్లీ జట్టు 59 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా 27 పాయింట్లతో తమిళ్ తలైవా జట్టు చివరి స్థానంలో కొనసాగుతున్నాయి. మన తెలుగు టైటాన్స్ తన పేలవ ప్రదర్శనతో చివరి నుంచి 30 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: