సౌతాఫ్రికా తో జరుగుతున్న మొదటి టెస్ట్ లో అల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఈమ్యాచ్ లో డీన్ ఎల్గర్ ను అవుట్ చేసి 200 వ వికెట్ ను ఖాతాలో వేసుకున్న జడేజా... అతి తక్కువ టెస్టు మ్యాచ్ ల్లో ఈ ఘనత సాధించిన మొదటి ఎడమ చేతి వాటం బౌలర్ గా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు
శ్రీలంక స్పిన్నర్ రంగనా హెరాత్ పేరిట వుండేది. హెరాత్ 47మ్యాచ్ ల్లో 200 వికెట్లు తీయగా జడేజా 40వ మ్యాచ్ తోనే ఈ ఫీట్ సాధించడం విశేషం. ఈక్రమంలో జడేజా మరో రికార్డు ను కూడా సాధించాడు.
భారత్ తరుపున టెస్టుల్లో వేగంగా 200 వికెట్ల ను తీసిన రెండో బౌలర్ గా జడేజా గుర్తింపు పొందాడు. రవిచంద్రన్ అశ్విన్ 36 మ్యాచ్ ల్లోనే ఈ ఘనత సాధించి ప్రస్తుతం ఈ జాబితాలో మొదటి స్థానం లో కొనసాగుతున్నాడు. మొత్తంగా 200వ వికెట్ల క్లబ్ లో చేరిన 10వ భారత బౌలర్ గా జడేజా ఘనత సాధించాడు. ఇదిలా ఉంటే తాజాగా జరుగుతున్న వైజాగ్ టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ లో 30పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన జడేజా..బంతి తో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు.
ఇక ఈమ్యాచ్ లో సౌతాఫ్రికా మూడో రోజు అసాధారణంగా పోరాడి మ్యాచ్ ను కాపాడుకుంది. భారత బౌలర్ల ను సమర్ధవంతగా ఎదుర్కొని ఎల్గర్ , డికాక్ లు సెంచరీలు చేయగా కెప్టెన్ డుప్లెసిస్ అర్ద సెంచరీ తో రాణించాడు. ఫలితంగా ను సౌతాఫ్రికా మూడో ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 8వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. కాగా భారత్ కంటే సౌతాఫ్రికా ఇంకా 117 పరుగులు వెనుకబడి వుంది.