టీమిండియా యువ స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ సెల్ఫ్‌ ట్రోల్‌ చేసుకున్నాడు. చాహల్‌ భారత కెప్టెన్‌ విరాట్ కోహ్లీని అభినందిస్తూ గురువారం తనను తాను ట్రోల్‌ చేసుకున్నాడు. పూణే వేదికగా గురువారం దక్షిణాఫ్రికాతో ప్రారంభం అయిన రెండో టెస్టు విరాట్‌ కోహ్లీకి కెప్టెన్‌గా 50వ మ్యాచ్‌. దీంతో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న 49 మ్యాచ్‌ల కెప్టెన్సీ రికార్డును కోహ్లీ అధిగమించాడు.

 

నా కన్నా 50 టెస్టులు మాత్రమే ముందున్నావ్‌:

మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 60 టెస్టు మ్యాచ్‌లకు నాయకత్వం వహించి తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ధోనీ తర్వాత.. కోహ్లీ 50వ టెస్ట్ మ్యాచ్‌కు సారథ్యం వహిస్తున్నాడు. ఈ సందర్భంగా చాహల్‌ ట్విటర్‌లో కోహ్లీని ఉద్దేశిస్తూ..'అభినందనలు భయ్యా. నా కన్నా 50 టెస్టులు మాత్రమే ముందున్నావ్‌' అంటూ సరదా ఎమోజీలను జత చేశాడు.

 

దీంతో చాహల్‌ సెల్ఫ్‌ ట్రోల్‌ చేసుకున్నాడు అని అభిమానులు అంటున్నారు. అంతకుమందు బీసీసీఐ కూడా కోహ్లీని అభినందిస్తూ ట్వీట్‌ చేసింది. 'దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు, కెప్టెన్‌గా కోహ్లీకి 50వ మ్యాచ్‌. టీమిండియా కెప్టెన్‌కి అభినందనలు' అని పేర్కొంది.

 

నంబర్‌ వన్‌ టెస్టు కెప్టెన్‌గా:

2014లో ధోనీ టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించాక విరాట్ కోహ్లీ జట్టు పగ్గాలు అందుకున్నాడు. కోహ్లీ ఇప్పటివరకు 49 మ్యాచ్‌ల్లో 28 విజయాలు అందించాడు. మొత్తంగా 58 శాతం విజయాలు నమోదు చేసి.. టీమిండియా నంబర్‌ వన్‌ టెస్టు కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఎంఎస్ ధోనీ 2008 నుంచి 2014 వరకు 60 మ్యాచ్‌లకు సారథ్యం వహించి.. 27 విజయాలు అందించాడు. ఇక సౌరవ్ గంగూలీ 49 మ్యాచ్‌ల్లో 21 విజయాలు అందించాడు.

 

ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడలేదు:

చాహల్‌ ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లలో సత్తా చాటుతున్నాడు. 50 వన్డే మ్యాచ్‌లలో 85 వికెట్లు.. 31 టీ20 మ్యాచ్‌లలో 46 వికెట్లు తీసాడు. టెస్టులలో సీనియర్ స్పిన్నర్లు ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజాలు జట్టులో కొనసాగతుండంతో చాహల్‌కు చోటు దక్కడం లేదు. ఇక ఇటీవలి కాలంలో టీ20 మ్యాచ్‌లలో కూడా చోటు కోల్పోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: