భారత మహిళా, పురుషుల హాకీ జట్లు ఒలింపిక్స్‌ బెర్త్‌ సాధించడానికి అడుగు దూరంలో నిలిచాయి. భువనేశ్వర్‌ వేదికగా శుక్రవారం జరిగిన క్వాలిఫయిర్స్‌ మ్యాచ్‌లో రష్యాపై పురుషుల హాకీ జట్టు 4-2 తేడాతో విజయం సాధించింది.భువనేశ్వర్‌: భారత మహిళా, పురుషుల హాకీ జట్లు ఒలింపిక్స్‌ బెర్త్‌ సాధించడానికి అడుగు దూరంలో నిలిచాయి.


భువనేశ్వర్‌ వేదికగా శుక్రవారం జరిగిన క్వాలిఫయిర్స్‌ మ్యాచ్‌లో రష్యాపై పురుషుల హాకీ జట్టు 4-2 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌ మొదలైన ఐదో నిమిషానికే పెనాల్టీ స్ట్రోక్‌ను హర్మన్‌ప్రీత్‌ గోల్‌గా మలిచాడు. 20వ నిమిషంలో మన్‌దీప్‌సింగ్‌ గోల్‌ కొట్టడంతో అర్ధభాగం ముగిసే సమయానికి భారత్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో సునిల్‌, మన్‌ప్రీత్‌ చెరో గోల్‌ కొట్టడంతో 4-1తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. కానీ, ఆఖర్లో రష్యా ఆటగాడు సెమెన్‌ గోల్‌ కొట్టడంతో భారత్‌ 4-2తో మ్యాచ్‌ ముగించింది.


అంతకుముందు జరిగిన ఒలింపిక్స్‌ మహిళా క్వాలిఫయిర్స్‌ మ్యాచ్‌లో యూఎస్‌ఏను భారత్ 5-1 తేడాతో మట్టికరిపించింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి భారత్‌ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో రాణిసేన ప్రత్యర్థి జట్టుని బెంబేలెత్తించింది. 11 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా నాలుగు గోల్స్ కొట్టింది.


భారత క్రీడాకారిణుల్లో గుర్జిత్‌ కౌర్ 42, 51వ నిమిషాల్లో రెండు గోల్స్‌ చేయగా లిలిమ 28, దేవి 40, నవనీత్‌ కౌర్ 46వ నిమిషాల్లో తలో గోల్‌ కొట్టారు. ఆఖర్లో అమెరికా క్రీడాకారిణి ఎరిన్‌ గోల్‌ కొట్టడంతో యూఎస్‌ఏ ఖాతాను తెరవగలిగింది. రేపు జరిగే పోరులో భారత హాకీ జట్లు ప్రత్యర్థులను చిత్తుచేసినా లేదా మ్యాచ్‌ను డ్రాగా ముగించినా భారత్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తుంది. రేపటి పోరులో ఒకవేళ మహిళలపై యూఎస్‌ఏ, పురుషులపై రష్యా గెలిస్తే గోల్స్‌ లెక్కల ప్రకారం ముందుకెళ్లే జట్టును నిర్ణయిస్తారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: