బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ తన మార్క్ను మరోసారి చూపించాడు. పదవీ చేపట్టిన తొలి సర్వసభ్య సమావేశంలోనే సంస్కరణల మార్పు చేపట్టాడు. సంస్కరణల మార్పుకు మిగతా సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ ఆమోదంతో మరో ఆరేళ్ల వరకు బీసీసీఐ బాస్గా గంగూలీనే కొనసాగనున్నాడు. ఇక మిగిలింది సుప్రీం కోర్టు ఆమోదం తెలపడమే.
ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆ పదవిలో 2024 వరకు కొనసాగే అవకాశం ఉంది. గంగూలీ ఆధ్వర్యంలో జరిగిన బీసీసీఐ తొలి సర్వసభ్య సమావేశంలో లోధా సంస్కరణల మార్పుకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఇక అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆమోదం తెలపడమే మిగిలింది.
బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుండే తన మార్క్ చూపించాడు. పదవీ చేపట్టిన వెంటనే ఫస్ట్ క్లాస్ క్రికెటర్ల జీతం విషయంలో మార్పులు తెచ్చాడు. ఆపై కెప్టెన్ విరాట్ కోహ్లీతో మాట్లాడి డే అండ్ నైట్ టెస్టులకు ఒప్పించాడు. మాజీ క్రికెటర్లతో చర్చించి ఫస్ట్క్లాస్ క్రికెట్ రోడ్ మ్యాప్కు ప్లాన్ చేశాడు. ఇప్పుడు అభివృద్ధికి నిరోధకంగా ఉన్న లోధా సంస్కరణల పని పట్టాడు.
సుప్రీం ఆమోదిస్తే బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో వరుసగా ఆరేళ్ల పాటు పదవిలో ఉన్న ఆఫీస్ బేరర్.. మూడేళ్లు తప్పనిసరి విరామం తీసుకోవాలనే లోధా కమిటీ షరతు ఇక ఉండదు. బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఐదేళ్లు పనిచేసిన దాదా తొమ్మిది నెలల్లో బీసీసీఐ అధ్యక్ష పదవిని విడిచిపెట్టాల్సిన అవసరం ఉండదు. దీంతో గంగూలీ 2024 వరకు అధ్యక్ష పదవిలో కొనసాగే అవకాశం ఉంటుంది. అతడితో పాటు బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా పూర్తికాలం తన పదవిలో కొనసాగవచ్చు. సుప్రీం కోర్టు కూడా ఈ నిర్ణయానికి ఒకే చెబితే.. బీసీసీఐ పాలనలో అడుగడుగున అడ్డంకిగా మారుతున్న లోధా సంస్కరణలకు దాదా చరమగీతం పాడినట్లే అంటున్నారు క్రికెట్ నిపుణులు.