ఐపీఎల్ 2020 సంవత్సరానికి గాను సీజన్ ఆటగాళ్ల వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ప్రధానంగా ముగ్గురు క్రికెటర్లపై దృష్టి సారించబోతున్నట్లు అర్ధమవుతోంది. కోల్కతా వేదికగా డిసెంబరు 19న ఆటగాళ్ల వేలం జరగనుండగా, ఇప్పటికే అట్టిపెట్టుకునే ఆటగాళ్లు, వేలంలోకి విడిచిపెడుతున్న క్రికెటర్ల జాబితాలని అన్ని ఫ్రాంఛైజీలు బీసీసీఐకి ఇచ్చేశాయి. ఈ క్రమంలో వేలంలోకి ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మని విడిచిపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్, అతని స్థానంలోకి యువ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ ను తీసుకోవాలని భావిస్తోంది. అలాగే కేదార్ జాదవ్, డ్వేన్ బ్రావోలకి బ్యాకప్ గా మరో ఇద్దరు క్రికెటర్లని తీసుకునేందుకు చెన్నై ఫ్రాంఛైజీలో చర్చ జరిగినట్లు సమాచారం.
ఐపీఎల్ వేలంలో రూ. 10.50 కోట్లకి అమ్ముడుపోయి అరుదైన రికార్డ్ లు నెలకొల్పిన జయదేవ్ ఉనద్కత్, 2019 ఐపీఎల్ సీజన్ లో పేలవ ప్రదర్శనతో అతను నిరాశపరిచాడు. టోర్నీలో 11 మ్యాచ్ లు ఆడిన జయదేవ్ 10.66 ఎకానమీతో కేవలం 10 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. దీనితో అతడిని ఇటీవల వేలంలోకి రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ విడిచిపెట్టింది. దీనితో ఐపీఎల్ 2020 సీజన్ వేలంలో అతని ధర కనీసం రూ.5 కోట్లు పలికే అవకాశాలు ఉన్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ప్రధాన ఆల్ రౌండర్ గా ఉన్న డ్వేన్ బ్రావో తరచూ గాయపడుతూ కీలక మ్యాచ్ లకి ఆడలేకపోతున్నాడు. దీనితో, అతడికి బ్యాకప్ గా వెస్టిండీస్ జట్టుకే చెందిన కార్లోస్ బ్రాత్ వైట్ ని తీసుకోవాలని చెన్నై యాజమాన్యం ఆలోచిస్తుంది. 2019 సంవత్సరం సీజన్ కోసం అతడిని రూ. 5 కోట్లకి కొనుగోలు చేసిన కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీ తాజాగా వేలంలోకి వదిలేసింది. దీనితో బ్రాత్వైట్పై చెన్నై యాజమాన్యం ఆలోచిస్తుంది.
కెరీర్ ఆరంభం నుంచి ఆల్ రౌండర్ కేదార్ జాదవ్ ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతూ వస్తున్నాడు. ఐపీఎల్ 2019 సీజన్ లో కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడిన జాదవ్, గాయం కారణంగా టోర్నీకి పూర్తిగా దూరమయ్యాడు. దీనితో ఐపీఎల్ 2020 సీజన్ కోసం కేదార్ జాదవ్ కి బ్యాకప్ గా విరాట్ సింగ్ ని తీసుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనితో ఆదివారం ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ - 20 ట్రోఫీలో 343 పరుగులతో విరాట్ సింగ్ చెలరేగాడు.