వెస్టిండీస్తో జరిగే మూడు టీ20 మ్యాచుల్లో భాగంగా ఆదివారం ఇక్కడి గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే సెకండ్ మ్యాచ్లోనూ గెలుపే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగనుంది. ఇక్కడే సిరీస్ పట్టేసి.. చివరి మ్యాచ్లో మరిన్ని ప్రయోగాలు చేయాలని కోహ్లీసేన గట్టి పట్టుమీద ఉంది.. మరోవైపు గత పది మ్యాచ్ల్లో తొమ్మిదో ఓటమి మూటగట్టుకున్న విండీస్ ఇప్పుడైనా గెలుపు బాట పట్టాలని ఆశిస్తోంది. బ్యాటింగ్తో పాటుబౌలింగ్లో కూడా మెప్పిస్తేనే కరీబియన్లు సిరీస్లో నిలువగలదు. ఇప్పటికే తిరుగులేని బ్యాటింగ్తో భాగ్యనగరంలో ఫస్ట్ షోలో సూపర్ హిట్ కొట్టిన టీమిండియా ఇప్పుడు సిరీస్పై గురి పెట్టింది.
ఇకపోతే ఉప్పల్ టీ20లో విలియమ్స్పై పూర్తి స్థాయిలో విరాట్ కోహ్లీ ఆధిపత్యం చెలాయించగా.. విలియమ్స్ రెండో టీ20లో అయినా ప్రతీకారం తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్లో వికెట్ పడగొట్టిన తర్వాత జేబులో నుంచి నోట్బుక్ తీసి అందులో టిక్లు పెడుతున్నట్లు సంబరాలు చేసుకోవడం ద్వారా విలియమ్స్ అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ.. ఉప్పల్ టీ20లో కోహ్లీ అదే తరహా సంబరాలతో అతడికి ఘోరమైన పరాభవాన్ని మిగిల్చాడు.
ఒకవేళ తిరువనంతపురం టీ20లో విరాట్ కోహ్లీ వికెట్ని అతను పడగొట్టగలిగితే.. మళ్లీ ఆ నోట్బుక్ సంబరాలు చేసుకోవడం ఖాయం. మరోవైపు విరాట్ కోహ్లీ అదే తరహాలో దూకుడు ప్రదర్శించి మళ్లీ ఆ సంబరాలు చేసుకుంటాడో లేదో తెలియాలంటే మ్యాచ్ వరకూ ఆగాల్సిందే. కానీ.. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మాత్రం సిరీస్కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇకపోతే ప్రపంచంలో ఏ మూల టీ20 లీగ్ జరుగుతున్న విండీస్ ఆటగాళ్లు బరిలో నిలుస్తున్నారు. దాంతో, నేషనల్ టీమ్కు ఆడే నాణ్యమైన ప్లేయర్లు కరువయ్యారు. ఆ కారణంగానే టీ20 చాంపియన్ల ఆట గాడి తప్పింది. అయినా పవర్ హిట్టర్లకు కొదవలేని టీమ్తో ఇండియాకు వచ్చిన కరీబియన్లు.. ఉప్పల్ లో భారీ స్కోరు చేసి ఇండియాకు షాకిస్తారనిపించింది. కానీ, విరాట్ కోహ్లీ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్తో వారికి దిమ్మతిరిగింది.