చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన మొదటి వన్డే లో వెస్టిండీస్, భారత్ పై 8వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచి సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈమ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 287పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన వెస్టిండీస్ 47.5 ఓవరల్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయకేతనం ఎగురవేసింది.
కాగా భారత ఇన్నింగ్స్ లో ఆల్ రౌండర్ జడేజా రన్ అవుట్ వివాదాస్పదమైంది. 48ఓవర్ లో నాల్గో బంతికి జడేజా సింగిల్ కోసం పరుగెత్తగా.. బంతితో రోస్టన్ ఛేజ్ నాన్ స్ట్రైకర్ వైపు త్రో విసిరాడు అది కాస్త వికెట్లను తాకుతూ వెళ్ళింది. అయితే ఛేజ్ అప్పీల్ చేయగా ఎంపైర్ తిరస్కరించాడు. కానీ రిప్లై లో మాత్రం అవుట్ అని తేలింది. అవుట్ ఫీల్డ్ లో వున్న వారు విండీస్ ఆటగాళ్లకు ఈవిషయం చెప్పారు. దాంతో ఆటగాళ్లు ఎంపైర్ ను నిలదీయగా ఎంపైర్ రివ్యూ కోరాడు. అప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. అయినా కూడా థర్డ్ ఎంపైర్ అవుట్ గా ప్రకటించాడు. దీనిపై డగౌట్ లో వున్న కోహ్లి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
ఇక మ్యాచ్ అనంతరం కోహ్లి ఈవిషయం పై స్పందించాడు. ఫీల్డర్ అప్పీల్ చేశాడు ఎంపైర్ అవుట్ ఇవ్వలేదు. అది అక్కడితో అయిపోయింది. కానీ రిప్లై లో చూసి బయట వున్న వ్యక్తులు ఫీల్డర్ల కు చెప్పడం ,వారు అవుట్ కోసం ఎంపైర్ ను రివ్యూ కోరడం ఇదంతా క్రికెట్ లో నేనెప్పుడూ చూడలేదు. రూల్స్ ఎక్కడున్నాయో నాకు తెలవడం లేదు. అదంతా ఎంపైర్ చూసుకోవాల్సిన పని. అంతేకాని బౌండరీ అవతలి వైపు కూర్చున్న వ్యక్తులు ఫీల్డింగ్ ను శాసించాలని చూడొద్దు కానీ ఇక్కడ అదే జరిగింది అని కోహ్లి ఘాటుగా సమాధానమిచ్చాడు. అలాగే ఓటమి పై కూడా స్పందిస్తూ.. పంత్ , అయ్యర్ అద్బుతంగా బ్యాటింగ్ చేశారు. ఈరోజ నేను , రోహిత్ క్లిక్ కాలేదు దాంతో యువ ఆటగాళ్లకు మంచి అవకాశం లభించింది. అలాగే హెట్ మేయర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అంటూ కోహ్లి చెప్పుకొచ్చాడు.