పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు రెండు టెస్టు సిరీసుల్లో ఓటమి చవిచూడటం, ప్రపంచకప్ సెమీఫైనల్కు రన్రేట్ కారణంగా చేరకపోవడం వంటి ఘటనలతో ఈ ఏడాది(2019) చాలా కష్టంగా గడిచిందని ఆ జట్టు కోచ్ మిస్బావుల్ హక్ పేర్కొన్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో తమ జట్టు ఆశించిన మేర రాణించలేదని ఆయన అసహనం వ్యక్తం చేశాడు.
దశాబ్దం తర్వాత స్వదేశంలో టెస్టు సిరీస్ జరగడం సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. అంతేకాకుండా ఈ ఏడాది శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను పాక్ 2-0తో కైవసం చేసుకోవడం తమ జట్టుకు మరో హైలెట్గా నిలిచిందన్నాడు. అయితే అదే జట్టుతో జరిగిన టీ20 సిరీస్లో చిత్తుచిత్తుగా ఓడిపోవడం కూడా చాలా బాధించిందన్నాడు.
అయితే మిస్బావుల్ దీనిపై స్పందించి ఓవరాల్గా క్రికెట్లో పాక్ ప్రదర్శనపై సంతృప్తికరంగా ఉన్నామని.. అయితే రెడ్ బాల్ క్రికెట్లో ప్రదర్శనపైనే తాము ఆందోళనగా ఉన్నామని అన్నాడు. తాము ఇంకాస్త దృష్టి టెస్టు ఫార్మట్పై పెట్టాలన్నాడు. అయితే ఏ జట్టుకైనా స్వదేశంలో టెస్టులు ఆడితే అదనపు బలం కలుగుతుందని అభిప్రాయపడ్డాడు. గత కొన్నేళ్లుగా పాక్లో టెస్టులు లేకపోవడం వలన జట్టులో స్థైర్యం దెబ్బతిందన్నాడు. పాక్లో కనీసం రానున్న ఏడాదిలోనైనా ఎక్కువ టెస్టులు ఆడగలిగితే తమ జట్టుకు ఎంతో లాభం చేకూరుతుందన్నాడు.
ముఖ్యంగా బాబర్ అజమ్పై ప్రశంసల జల్లు మిస్బావుల్ కురిపించాడు. ఫార్మట్తో సంబంధం లేకుండా పరుగుల వరద పారించాడని, అతడే పాక్ జట్టుకు స్టార్ బ్యాట్స్మన్ అని కితాబిచ్చాడు. ఇక అతడితో పాటు కర్రాళ్లు నసీమ్ షా, షాహీన్ ఆఫ్రిదిల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుందన్నాడు. అంతేకాకుండా పాక్ భవిష్యత్ క్రికెటర్లు వీరేనంటూ ఆయన వ్యాఖ్యానించాడు. ఇక ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యం టీ20 ప్రపంచకప్ అని ఈ మెగా టోర్నీ కోసం సన్నద్దమవుతున్నట్లు మిస్బావుల్ తెలిపాడు. 2017 చాంపియన్ ట్రోఫీ తర్వాత పాక్ చెప్పుకునేంత పెద్ద టోర్నీలు గెలవలేదని.. అందుకే ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నట్లు పేర్కొన్నాడు.