కివీస్ తో జరిగిన నాల్గో టీ 20 లో అవకాశం దక్కించుకొన్న టీమిండియా యువ బ్యాట్స్ మెన్ సంజు శాంసన్ బ్యాటింగ్ లో విఫలమైనా ఆమ్యాచ్ లో ఫీల్డింగ్ లో అదరగొట్టాడు. ఇక ఈరోజు జరుగుతున్న చివరి టీ 20 లో కూడా సంజు తన ఫీల్డింగ్ విన్యాసాలతో అబ్బురపరిచాడు. ఈమ్యాచ్ లో సంజు బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రాస్ టేలర్ ,శార్దూల్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడాడు. దాంతో గాల్లోకి ఎగిరిన బంతి సిక్స్ కు వెళ్లేలా కనిపించింది కానీ సంజు బౌండరీ లైన్ దగ్గర గాల్లోకి ఎగురుతూ బంతిని ఆపి నాలుగు పరుగులు సేవ్ చేశాడు. దాంతో సంజు చేసిన ఆ ఫీట్ కి ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక ఫీల్డింగ్ లో ఆద్యంతం అదరగొట్టిన సంజు బ్యాటింగ్ లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు.
గత మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చిన సంజు నిర్లక్ష్యంగా ఆడి తక్కువ స్కోర్ కే వెనుదిరగగా తాజాగా చివరి టీ 20 లో కూడా అదే తరహాలో అవుట్ అయ్యి నిరాశపరిచాడు. ఇక ఈమ్యాచ్ లో భారత్ విజయం దిశగా పయనిస్తుంది. 165 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన కివీస్ ప్రస్తుతం 18.2ఓవర్ల లో 9వికెట్లు కోల్పోయి 141పరుగులు చేసింది. దాంతో ఈమ్యాచ్ తో భారత్ 5మ్యాచ్ ల టీ 20సిరీస్ ను 5-0 తో క్లీన్ స్వీప్ చేయనుంది.