న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఆతిధ్య జట్టు తో 5టీ 20ల సిరీస్ లో తలపడ్డ భారత్ .. ఆ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది ఇక ఇప్పుడు వన్డే సిరీస్ పై కూడా కన్నేసింది. అందులో భాగంగా నేడు కివీస్ తో టీమిండియా మొదటి వన్డే లో తలపడనుంది. హామిల్టన్ లోని సెడన్ పార్క్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 7:30 గంటలకు ప్రారంభం కానుంది.
ఇక ఈమ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు జరుగనున్నాయి. గాయాలతో స్టార్ ఓపెనర్లు రోహిత్ శర్మ ,శిఖర్ ధావన్ ఈ సిరీస్ కు దూరం కావడంతో వారి స్థానాలో మయాంక్ అగర్వాల్ ,పృథ్వీ షా లు చోటు దక్కించుకున్నారు. ఇక మొదటి వన్డే లో పృథ్వీ షా ఓపెనర్ గా రానున్నాడని అలాగే రాహుల్ మిడిల్ ఆర్డర్ లో వస్తాడని కెప్టెన్ కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు దాంతో మయాంక్ తోకలిసి పృథ్వీ ఓపెనింగ్ చేయనున్నాడు. మరోవైపు మొదటి రెండు వన్డే లకు కెప్టెన్ విలియమ్సన్ దూరం కావడంతో న్యూజిలాండ్ కు భారీ దెబ్బ పడింది. విలియమ్సన్ తోపాటు స్టార్ పేసర్ బౌల్ట్ ,ఫెర్గుసన్ సిరీస్ కు దూరం కావడంతో కివీస్ బలహీనంగా కనిపిస్తుంది. అయితే సొంత గడ్డపై ఆడనుండడం ఒక్కటే ఆజట్టుకు కలిసొచ్చే అంశం.