గత కొద్దీ రోజులుగా కరోనా వైరస్ చైనాని వణికిస్తుంది. చైనాలోని వుహాన్ నగరంలో కరోనా వైరస్ ఉనికి వ్యాప్తిలోకి వచ్చింది. కరోనా వైరస్ దెబ్బకు చైనా అతలాకుతలమైంది. మరోవైపు చైనాతో సరిహద్దును పంచుకుంటున్న ఆయా దేశాలు చైనాకు వెళ్లే దారిని మూసివేశాయి. చైనాలో వెలుగు చూసిన కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా వణికిపోతోంది. చైనాలో ఇప్పటికే వేలాది మందికి ఈ వ్యాధి సోకింది. ఈ వ్యాధితో పదుల సంఖ్యలో అక్కడి ప్రజలు మరణించారు.
అలాగే మిగతా దేశాల్లో అక్కడక్కడ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. భారత దేశంలోని కేరళలో ఈ వ్యాధితో సోకిన బాధితుడిని గుర్తించారు. అతనిని డాక్టర్స్ అదుపులోకి తీసుకోని చికిత్స అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో జపాన్లో ఈ జూలై నుంచి నిర్వహించే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ గేమ్స్ను వాయిదా వేస్తారని ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా ఒలింపిక్స్ నిర్వాహకులు దీనిపై స్పందించారు.
నిర్వాహకులు తాజా పరిస్థితిని సమీక్షించి ఒక ప్రకటనను విడుదల చేశారు. ఒలింపిక్స్ అనుకున్న సమయానికి జరుగుతుందన్నారు. ఒలింపిక్స్ గేమ్స్ వాయిదా అంటూ వస్తున్న పుకార్లను నమ్మవద్దని నిర్వాహకులు తెలిపారు. అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ (ఐపీసీ) అధికార ప్రతినిధి క్రెయిగ్ స్పెన్స్ దీనిపై మాట్లాడుతూ చైనా అవతల చాలా కొద్ది మొత్తంలో కరోనా కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సలహాలను తీసుకుని, వచ్చే ఒలింపిక్స్ను నిర్వహిస్తామని పేర్కొన్నారు.
నాలుగేళ్ల కిందట రియోలో ఒలింపిక్స్ జరిగినప్పుడు జికా వైరస్ వచ్చింది. అప్పట్లో ఈ వ్యాధి గడగడలాడించిందని క్రెయిగ్ అన్నారు. ఆ టోర్నీలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని, విజయవంతంగా మెగాటోర్నీని నిర్వాహించామని గుర్తు చేశారు. జపాన్ లో త్వరలో జరిగే ఒలింపిక్స్ లోనూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్ జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరుగుతుందని తెలిపారు.