లెజెండరీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ తనయుడు సమిత్ ద్రావిడ్ క్రికెట్ లో విధ్వంసం క్రియేట్ చేస్తున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. తన తండ్రి అయిన సీనియర్ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ శిక్షణలో రాటు తేలిన సమిత్ ఇప్పుడు దేశవాళీ టోర్నీలో వీరబాదుడు బాదుతున్నాడు. బ్యాటింగ్ లో మాత్రమే కాదు బౌలింగ్ లోనూ అదరగొడుతున్నాడు. ఇటీవల ముంబైలో జరిగిన అండర్ 14 బీటీఆర్ షీల్డ్ టోర్నీ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లో తాను ఆడిన టీం అయిన అదితి ఇంటర్నేషనల్ టీంను ఒంటి చేత్తో గెలిపించేశాడు.
ఈ మ్యాచ్లో సమిత్ బ్యాటింగ్లో సెంచరీ బాదడంతో పాటు బౌలింగ్లోనూ రాణించి నాలుగు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో ముందు బ్యాటింగ్ చేసిన మాల్యా జట్టు 50 ఓవర్లలో 330 పరుగులు చేసింది. ఇందులో సగం రన్స్ సమిత్ ద్రావిడ్ ఒక్కడే చేశాడు. 131 బంతుల్లో 24 బౌండరీలతో 166 పరుగులు చేశాడు. తోటి ప్లేయర్ అన్వయ్ 90 పరుగులతో అతడికి అండగా నిలిచాడు.
331 పరుగులతో బ్యాటింగ్ చేపట్టిన విద్యా షిల్ప్ అకాడమీ జట్టు 38.5 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌట్ అయింది. సమిత్ కేవలం 35 రన్స్ ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ లో విజయంతో మాల్యా స్కూల్ జట్టు సెమీ ఫైనల్కు చేరింది. ఇక ఇదే టోర్నీలో గతంలో జరిగిన మ్యాచ్లో సమిత్ ఏకంగా డబుల్ సెంచరీ చేశాడు. శ్రీకుమరన్ జట్టుపై 33 బౌండరీలతో 204 రన్స్ చేశాడు.